ఉచిత చేప పిల్లల పంపిణీలో పాంప్లెట్ ల కల్తీ
మత్స్యకారులకు తీవ్ర నష్టం!
మరిపెడ/చిన్నగూడూరు (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం జయ్యారం పెద్ద చెరువులో మంగళవారం ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాంప్లెట్లు (అనధికార రకం చేపలు) చొరబడ్డాయనే విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం పాంప్లెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులలో విడుదల చేయరాదు. కానీ ఈసారి పంపిణీ చేసిన చేప పిల్లలలో పాంప్లెట్లు ఉండటం వల్ల మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల పెంపకంలో పాంప్లెట్లు ప్రమాదకరమైనవి. సాధారణ చేపలు గుడ్ల ద్వారా పిల్లలను ఉత్పత్తి చేస్తే, పాంప్లెట్లు నేరుగా నోటి ద్వారా చేప పిల్లలను విడుదల చేస్తాయి.
దీని ఫలితంగా చెరువుల్లో విపరీతంగా పాంప్లెట్లు పెరిగి ఇతర చేపల ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. జయ్యారం చెరువులో విడుదల చేసిన ఉచిత చేప పిల్లల్లో పెద్ద సైజు పాంప్లెట్లను మాత్రమే వడపోసి తీసినా, చిన్న సైజు పాంప్లెట్లు ఎక్కువగా మిగిలిపోయి చెరువులో కలిసిపోయాయి. దీని వల్ల అసలు చేపల ఉత్పత్తి గణనీయంగా పడిపోవచ్చని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అసలుగా జయ్యారం చెరువులో 4,60,000 చేప పిల్లలు విడుదల చేయాల్సి ఉండగా కేవలం 1,70,000 మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇంకా 2,90,000 చేప పిల్లలు విడుదల కావాల్సి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలలో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం జయ్యారం పెద్ద చెరువులో జిల్లా ఇన్చార్జి మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, జయ్యారం మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లుతో కలిసి చేప పిల్లలను విడుదల చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.120 కోట్లతో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తుండగా, మహబూబాబాద్ జిల్లాలోని 1,229 చెరువుల్లో 4.20 కోట్ల చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీని వలన 15,437 మంది సభ్యులు ప్రత్యక్షంగా, అలాగే మరో 20 వేల కుటుంబాలు పరోక్షంగా లాభం పొందుతాయని చెప్పారు. మత్స్యశాఖకు తొలిసారిగా మత్స్యకారుల వర్గానికి చెందిన శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ ని మంత్రి చేయడం ద్వారా చేపల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పటిష్టంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
గత ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించగా, ఈసారి మంత్రి శ్రీహరి రూ.120 కోట్ల నిధులను కేటాయించారని అన్నారు. మత్స్యకారులకు సూచనలు చేప పిల్లలు చెరువులకు చేరినప్పుడు తప్పనిసరిగా కిలో చొప్పున లెక్కించి చెరువులో విడుదల చేయాలని, కిలోకు 250–300 చేప పిల్లలు మాత్రమే ఉండాలని సూచించారు. ఈ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్న ప్యాకెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయకూడదని హెచ్చరించారు. సిబ్బంది చెప్పే మాటలకు మొహమాటపడకుండా ప్రతి కవర్ను తెరిచి లెక్కపెట్టి తీసుకోవాలి, స్కేల్తో కొలత వేయాలి అని శ్రీనివాస్ ముదిరాజ్ స్పష్టంచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రచార కార్యదర్శి దుండి వెంకటేశ్వర్లు ముదిరాజ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ పిడుగు వెంకన్న ముదిరాజ్, మాజీ సర్పంచ్ దుస్స నరసయ్య ముదిరాజ్, యువజన విభాగం నాయకులు సురబోయిన రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






