calender_icon.png 20 June, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ గురుకులాల దూకుడు

20-06-2025 01:03:24 AM

  1. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి బోధన
  2. జేఈఈ, నీట్, ఎప్‌సెట్‌లో ఉత్తమ ర్యాంకులు 
  3. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీతోపాటు ఎంబీబీఎస్, బీడీఎస్, సెంట్రల్ వర్సిటీల్లో సీట్లు పొందుతున్న గురుకులాల విద్యార్థులు
  4. సీట్ల కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): అక్కడ సీటు యమ హాటు గురూ అనేలా ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పరిస్థితి ఉంది. సర్కార్‌కు సాటి గా.. ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉత్త మ ఫలితాలు సాధిస్తున్నాయి. కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుండ టంతో ఆయా గురుకులాల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఎన్న డూ లేనంతగా ఈసారి వందశాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

ప్రైవేటు విద్యకు దీటు గా ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులు రాణిస్తున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంజినీర్లు కావాలంటే కేవలం కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థల్లో చదివితేనే సాధ్యమవుతుందనే నానుడి గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం టెన్త్, ఇంటర్ ఫలితాలతోపాటు, వైద్యవిద్య, ఇంజినీరింగ్‌తోపాటు ఉన్నత విద్యలో ప్రవే శాల కోసం నిర్వహించే జేఈఈ, నీట్, ఎప్‌సెట్, క్లాట్ తదితర పోటీ పరీక్షల్లో గురుకులాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు.

తమకెవ్వరూ పోటీ కాదని, తామే అందరికీ పోటీ అనేలా సీట్లు పొందుతున్నారు. రాష్ట్రంలో 268 ఎస్సీ గురుకులాలుంటే, అందులో 93 బాలుర విద్యాసంస్థలు, 145 బాలికలు, 30 డిగ్రీ విద్యాసంస్థలున్నాయి. వీటిలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు 238 విద్యాసంస్థలున్నాయి. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉత్తమ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఐఐటీ ఫౌండేషన్ తరగతులను బోధిస్తారు.

అందులోనూ గౌలిదొడ్డి, షేక్‌పేట్, మహేంద్ర హిల్స్‌లోని విద్యాసంస్థలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గత పదకొండేళ్లలో మొత్తం 10,914 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంస్, ఐసీఏఆర్, ఫార్మసీ, నర్సింగ్, నల్సార్, ఢిల్లీ వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ, అజిమ్ ప్రేమ్‌జీ వర్సిటీ, ఐఎంయూ వంటి సీట్లను సాధించారు.

2014-15 నుంచి 2023-24 వరకు వైద్య విద్యలో 3,362 మంది సీట్లు పొందారు. 2024-25లో జూన్ నెలవరకు మరో 204 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. మొత్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ సీట్లు పొందినవారు 3,566 మంది ఉన్నారు. వీరిలోనూ ఎంబీబీఎస్ సీట్లు సాధించిన వారే 1,241 కావడం విశేషం. బీడీఎస్ సీట్లు సాధించిన వారు 127 మంది, బీఏఎంఎస్ 12 మంది, బీహెచ్‌ఎంఎస్ 35 మంది ఉన్నారు.

ఐఐటీ, ఎన్‌ఐటీల్లోనూ సత్తా..

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లోనే కాకుండా దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుట్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లోనూ గురుకుల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఈ సీట్లు సాధించాలంటే ప్రైవేట్‌లో ఒక్కో విద్యార్థికి రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోంది.

విద్యార్థులకు కోడింగ్, ఏఐ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణనిస్తోంది. 2013-14 నుంచి 2023-24 వరకు ఇంజినీరింగ్‌లో 6,178 మంది సీట్లు సాధించగా, 2024- 25లో 105 మంది (జోసా మొదటి ఫేజ్ వరకు) పొందారు. మొత్తంగా పదకొండేళ్లలో ప్రతిష్ఠాత్మకమైన ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో 6,283 మంది సీట్లు పొందారు.

వీటిలో గత పదేళ్లలో చూసుకుంటే ఐఐటీలో 354, ఎన్‌ఐటీలో 509, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో 154, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో 908 మంది, ఇతర ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,253 మంది సీట్లు పొందారు. ఇక 2024-25 విద్యాసంవత్సరంలో ఐఐటీలో 35, ఎన్‌ఐటీలో 39, ట్రిపుల్ ఐటీలో 10, జీఎఫ్‌టీఐలో 21 మంది సీట్లు పొందారు.

ఇవి కాకుండా ఇతర ఉన్నత విద్యాకోర్సుల్లో గురుకులాల విద్యార్థులు మరో 1,065 మంది సీట్లు పొందారు. 2014-15 నుంచి 2023-24 వరకు ఢిల్లీ యూనివర్సిటీల్లో 101 మంది, సెంట్రల్ యూనివర్సిటీల్లో 117 మంది, సీఎంఏ ఫౌండేషన్‌లో 184 మంది, అజిమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో 81 మంది, ఇండియన్ మారిటైమ్ వర్సిటీలో 49 మంది, నల్సార్‌లో 9 మంది, ఐఐఎస్‌ఈఆర్‌లో 19 మంది, స్టేట్ లా కాలేజీల్లో 21 మంది, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో 405 మంది విద్యార్థులు గత పదేళ్ల కాలంలో సీట్లు పొందారు.

మొత్తంగా పదేళ్లలో 10,605 సీట్లు సాధించగా, 2024-25లో ఇప్పటి వరకు ఎంబీబీఎస్, ఐఐటీల్లో సీట్లు సాధించిన వారు 105 మంది ఉన్నారు. జోసా కౌన్సిలింగ్ ఇంకా కొనసాగుతుండటంతో మరికొంత మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

సీట్ల కోసం సిఫార్సు లేఖలు..

ఎస్సీ గురుకులాల్లో సీట్ల కోసం సిఫార్సు లేఖలు వస్తుండటం గమనార్హం. మెరిట్ ప్ర కారంగానే అధికారులు విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నప్పటికినీ కొంతమంది తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు, ఎమ్మెల్యేల నుంచి సీటు కావాలని సిఫార్సు లేఖలు తీసుకొస్తున్నారంటే ఈ గురుకులాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం అడ్మిషన్లు ఇటీవలే భర్తీ అయ్యాయి.

ఐదో తరగతిలో దాదాపు 51 వేల సీట్లు, ఆరో తరగతిలో 2,600, ఏడో తరగతిలో 1,040, ఎనిమిదో తరగతిలో 1,080, తొ మ్మిదో తరగతిలో 1,550 వరకు అడ్మిషన్లున్నాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 19,000 వర కు అడ్మిషన్లున్నాయి. అయితే 2025-26 విద్యాసంవత్సరానికి ఈ సీట్లన్నీ భర్తీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. కొంత మంది విద్యార్థులు తమకు కేటాయించిన గు రుకులాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతేమైనా కొన్ని సీట్లు మిగిలితే వాటిని మెరిట్ ప్రకారం విద్యార్థులకు కేటాయిస్తామని అధికారులు అంటున్నారు.