వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి
దమ్మపేట,(విజయక్రాంతి): మండలంలోని దమ్మపేట రైతు వేదిక నందు మంగళవారం రైతులతో వ్యవసాయ అధికారి చంద్ర శేఖర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం వర్షాకాలంలో వరి పంట సుమారు పదివేల ఎకరాలు సాగు చేశారని, కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు కూడా 1000 ఎకరాల లోపు విస్తీర్ణంలో మాత్రమే వరి నాటడం జరిగిందన్నారు.
దీనికి ప్రధాన కారణం ఎల్నినో ప్రభావం వలన సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదు కావడం, చెరువులలో, కుంట లలో నీళ్లు లేకపోవటం, అదేవిధంగా బోర్లలో నీటి శాతం, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోవడం వలన సాగు విస్తీర్ణం అనేది ప్రశ్నార్థకంగా మారిందని, రైతులు ఈ ఎల్నినో ప్రభావంతో జులై, ఆగస్టు నెలల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు వరి కి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే అపరాలు, చిరుధాన్యపు పంటలు సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, దమ్మపేట ఏఈఓ అను బాబు, రైతులు పాల్గొన్నారు.






