26-09-2024 12:00:00 AM
ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ శాసిస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా వైద్యరంగంలో పెను సంచలనాలకు కారణం అవుతోంది. ఇరాక్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కృత్రిమ మేధస్సు (ఏఐ) తో సరికొత్త కంప్యూటర్ అల్గారిథమ్ను రూపొందించారు. కేవలం నాలుగు రంగును చూసి రోగం ఏంటో చెప్పేలా ఏఐ మోడల్ డాక్టర్ను తీర్చిదిద్దారు. రోగ నిర్ధారణ 98శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉంటుందన్నారు.
ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా ఉన్న అలీ అల్ నాజీ నేతృత్వంలో ఈ పరిశోధన కొనసాగింది. సాధారణంగా డయాబెటిస్ ఉన్న వ్యక్తుల నాలుక నలుపు రంగులో ఉంటుంది. క్యాన్సర్ రోగుల నాలుకపై మందపాటి ఊదారంగు పూతను కలిగి ఉంటారు. తీవ్రమైన స్ట్రోక్స్తో బాధపడే వారి నాలుక డిఫరెంట్ రెడ్ కలర్తో ఉంటుందట.
నాలుకల రంగును బట్టి ఏఐ మోడల్ డాక్టర్ ఆరోగ్య సమస్యలను గుర్తించే అవకాశం ఉందని అల్ నాజీ వెల్లడించారు. రక్తహీనత ఉన్నవారి నాలుక తెలుపు రంగంలో, జీర్ణాశయ సమస్యలు ఉండేవారి నాలుక నీలం రంగులోకి మారుతుందని పరిశోధకులు తెలిపారు. నాలుక రంగును బట్టి ఈజీగా వ్యాధిని గుర్తించే అవకాశం ఉందన్నారు.
ఏఐ మోడల్ డాక్టర్కు ట్రైనింగ్
నాలుక రంగులను బట్టి వ్యాధిని నిర్థారించేందుకు ఏఐ మోడల్ డాక్టర్కు ఏకంగా ఐదు వేల 200 ఫోటోలతో ట్రైనింగ్ ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు మిడిల్ ఈస్ట్ లోని రెండు హాస్పిటల్స్కు చెందిన 60 మంది పేషెంట్ల నాలుకల ఫోటోలను ఉపయోగించి ఏఐ మోడల్ను పరీక్షించినట్లు వెల్లడించారు.
ఈ పరీక్షల సమయంలో రోగులను ల్యాప్ టాప్ వెట్ క్యామ్ నుంచి దాదాపు ఎనిమిది అంగుళాల దూరంలో ఉంచారు. ఏఐ వారి నాలుక ఫోటో తీసి వ్యాధి ఏంటో కచ్చితంగా నిర్థారించిందని పరిశోధకులు తెలిపారు. అన్ని పరీక్షల్లో ఏఐ మోడల్ కచ్చితంగా వ్యాధిని నిర్థారించినట్లు తెలిపారు.