06-05-2025 03:15:53 PM
రాంచీ,(విజయక్రాంతి): జార్ఖండ్ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రవాదల దాడిలో 26 మంది అమాయకులు మరణించారని గుర్తు చేశారు. ఈ ఘటన నిఘా వైఫల్యం కారణంగానే జరిగినట్లు బీజేపీ ప్రభుత్వం అంగీకరించిందని, దానిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిఘా లోపం గురించి ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, ముందుగానే మెరుగైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు..? అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. జార్ఖండ్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను మొదటిసారి ఇక్కడ పర్యటిస్తున్నానని, జార్ఖండ్ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మీ వల్లే మాకు మెజారిటీ వచ్చిందని, నేడు జార్ఖండ్లో బలమైన ప్రభుత్వం నడుస్తోందని ఖర్గే హర్షం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తాము నెరవేరుస్తున్నామని, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అందరూ కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నన్నారు. దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఉగ్రవాద దాడి జరుగుతుందని నిఘా సంస్థలు ముందే ఊహించినప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేదు..? అని ఖర్గే ప్రశ్నించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు తెలిపిందని, ప్రభుత్వం పాకిస్తాన్పై ఏదైనా చర్య తీసుకుంటే అందుకు తాము కేంద్రం కలిసి నిలబడతామని స్పష్టం చేశారు. దేశమే అన్నింటికన్నా పెద్ద విషయమని, పార్టీ, మతం, కులాలు దీని తర్వాత వస్తాయని, దేశం కోసం ఎంతో మంది ప్రాణాలర్పించారని, దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ దేశానికి స్వేచ్ఛ ఇచ్చారు. కానీ ఒక దేశద్రోహి ఆయన ఛాతీలో బుల్లెట్లను పేల్చాడని వివరించారు.
రాహుల్ గాంధీ దేశంలో కుల గణన చేయాలని భారత్ జోడో యాత్రలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, తమ డిమాండ్ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని విభజించాలనుకుంటున్నారని చెప్పినట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు ఆయన స్వయంగా కుల గణన నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, మా కార్యకర్తల విజయం.. నరేంద్ర మోడీ ఓటమి. కాబట్టి, మనమందరం ఐక్యంగా ఉండి ప్రజల కోసం పని చేయాలి, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడాలని ఖర్గే సూచించారు.కాంగ్రెస్ పార్టీతో పాటు, రాహుల్ గాంధీ దేశంలోని దళిత, వెనుకబడిన, గిరిజన తరగతుల ప్రజలు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే వారు దేశ పురోగతికి తోడ్పడాలని కోరుకుంటారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరించారు.