calender_icon.png 18 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడి పశువుల పెంపకానికి చేయూత

01-12-2024 04:37:18 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్..

మణుగూరు: పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పి వి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు. ఒకప్పుడు పాడి రైతులు పశువులను పెంచాలంటే తెల్లవారుజామున నుంచే మేత వేయటం పాలు పితకడం వంటి చాకిరీ ఉండేదని చెప్పారు.

ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది పాడి రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వ పరంగా పాడి రైతులకు ఎన్నో రకాల ప్రోత్సాహాలను అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్లకు, మేత పెంపకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. కొంత అవగాహన రాహిత్యంతో రైతులు వీటిని సద్వినియొగం చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఏదైనా మనం సాధించాలంటే అది సొంత ఊరిలోనే సాధించేలా ఆలోచనలు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో స్థలాలు, గోపాల మిత్రులు అందుబాటులో ఉంటే అక్కడ పశువైద్యశాల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాడి రైతులకు అనేక సబ్సిడీ పథకాలను ప్రభుత్వం వర్తింపు చేస్తుందని అన్నారు. జిల్లాలో పాడి సంపదను పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చెప్పారు.

పాడి రైతులు పశువులకు సంక్రమించే వివిధ రకాల జబ్బుల విషయంలో వెంటనే పసికట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్సలందించాలని చెప్పారు. పాడి పశువులకు ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గ్రామాల్లో వాటిని మరింత విస్తరింపజేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. పశు వైద్య శిబిరాల నిర్వహణతో మరింత అవగాహన కలుగుతుందని వీటిని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడి రైతులు ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బి.పురేందర్, పశుగణాభివృద్ధి అధికారి డాక్టర్ కిషోర్, సహాయ సంచాలకులు సత్యప్రసాద్, రవీంద్రనాథ్ ఠాగూర్, యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.