01-08-2025 04:35:04 PM
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాలను ప్రకటించి కార్మికులకు లాభాల వాటాని చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లపై ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ(AITUC Branch Secretary Shailendra Satyanarayana) ఉపాధ్యక్షులు భీమనాధుని సుదర్శన్ లు మాట్లాడారు. కార్మికులకు లాభాల వాటా 35% చెల్లించాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని, నాణ్యమైన బూట్లను, రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.
సిపిఆర్ఎంఎస్ పథకం ద్వారా రిటైర్డ్ కార్మికులకు అందించే వైద్య సేవల్లో ఛార్జీల వసూలు నిలిపివేయాలని, రిటైర్ కార్మికులకు బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని కోరారు. ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించి హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలన్నారు. పెర్క్స్ పై ఆదాయం పన్ను ను సింగరేణి యాజమాన్యం భరించాలన్నారు. క్యాంటీన్ లలో నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాల న్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది శ్రీనివాస్, గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, పారిపల్లి రాజేశం, కలువల శ్రీనివాస్, సృజన గీతిక, సంజీవ్, సోమశెట్టి రాజేశం, ఎగేటి రాజేశ్వరరావు రమణ వెంకటేశ్వర్లు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.