ఆసిఫాబాద్ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలి
మున్సిపల్ చైర్మన్ ఆకాష్ , వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం 9వ వార్డులో అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ , కౌన్సిలర్ లతో కలిసి పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడమే కాకుండా, స్థానిక ప్రజలతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి , ప్రజా ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. కేవలం అధికారుల వల్ల మాత్రమే మార్పు రాదని, ప్రజలు కూడా తమ బాధ్యతగా తడి, పొడి చెత్తను వేరు చేయడం నేర్చుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అనుసరిస్తే చెత్త సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని ఆయన సూచించారు. కుండీలు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు.
ప్లాస్టిక్ రహిత లక్ష్యంలో భాగంగా వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తక్షణమే మానుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి వీధులను శుభ్రపరిచారు. దోమల నివారణకు మందు స్ప్రే చేయించడంతో పాటు, మంచినీటి ట్యాంకర్లను శుభ్రం చేసి ప్రజలకు సురక్షితమైన నీరు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం బిన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజనంద్, టి.ఎం.సి, ఆర్.పి. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




