రైస్ మిల్లర్లందరికీ ఓటు హక్కు కల్పించాలి
13 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం దురదృష్టకరం
ములుగు, జులై 19 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని రైస్ మిల్ యజమానులందరికీ ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంతో పని చేస్తున్నామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎంఆర్ పెట్టె రైస్ మిల్లర్లు అందరికీ త్వరలో జరిగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా మిల్లర్లు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ములుగు కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆరు జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
2013 నుంచి అసోసియేషన్ కు ఎన్నికలు జరగకపోవడంతో అప్పటినుంచి ఒకే కార్యవర్గం అధికారంలో ఉందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఉన్న మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో ఆ కమిటీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. మిల్లర్ల సంక్షేమానికి వారు చేసింది ఏమి లేదన్నారు. దీంతో సదరు అసోసియేషన్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. తిరుగుబాటుకు భయపడ్డ రాష్ట్ర కమిటీ అసోసియేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసిందని, ఇది ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్ సాధించిన విజయమని స్పష్టం చేశారు. అయితే పాత బైలా ప్రకారంగా 25 వేల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ కు ఒక ఓటు చొప్పున నిర్ణయించారని,
ఇది రైస్ మిల్లర్ల సంక్షేమానికి పూర్తి విరుద్ధమని వెల్లడించారు. మిల్లు నడుపుతున్న ప్రతి యజమానికి ఓటు ఒక కల్పించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్ ను సమీకరించి ఎన్నికల కమిటీపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఉద్యమ కార్యచరణ సిద్ధమైందని, రైస్ మిల్లర్లు అందరూ సంఘటితం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు తోట సంపత్ కుమార్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవునూరి అంజయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు గోనెల రవీందర్, జనగామ జిల్లా అధ్యక్షులు ముత్తయ్య, భూపాలపల్లి జిల్లా గౌరవాధ్యక్షులు కోరే రవి, మహబూబాద్ జిల్లా కోశాధికారి సతీష్, వివిధ జిల్లాల కార్యదర్శిలు నాయకులు పాల్గొన్నారు.






