బోధన్లో అంగరంగ వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర
బోధన్,జూలై 19 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని అచన్పల్లిలో గల శ్రీ అలివేలు మంగమ్మ ఆలయం నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు ఆదివారం నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ‘జై శ్రీ జగన్నాథ్‘, ‘హరే కృష్ణ, హరే రామ‘ నామస్మరణలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ, ఆమె భర్త శరత్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇస్కాన్కు చెందిన అశోక్ నిత్యదాస్, రాధిక మాతాజీతో పాటు ఇస్కాన్ బృందం పాల్గొని భక్తులకు సుమారు 1,10,000 కాకినాడ కాజాలు ప్రసాదంగా పంపిణీ చేసింది. అచన్పల్లి నుంచి ప్రారంభమైన రథయాత్ర అచన్పల్లి చౌరస్తా, శక్కర్నగర్ చౌరస్తా, న్యూ బస్ స్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు ఘనంగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిపారవశ్యంతో రథాన్ని అనుసరించారు.
రథయాత్రలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.






