15-06-2025 12:00:00 AM
21న కట్టెకోల ఏకాదశి, అంతర్జాతీయ యోగా దినోత్సవం
సంవత్సర కాలంలో హిందువులు పాటించే 24 ఏకాదశి వ్రతాలలో యోగినీ ఏకాదశి వ్రతం ఒకటి. జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు యోగినీ ఏకాదశిని ఆచరించాలి. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం చేసి శ్రీహరిని ధ్యానిస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి. 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, యోగినీ ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారినుండీ కాపాడుతుంది. చర్మరోగాలను హరింప జేస్తుంది. యోగినీ ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్టిరునికి చెప్పినట్లుగా ‘బ్రహ్మ వైవర్త పురాణం’ చెబుతున్నది.
యోగినీ ఏకాదశిని ఎలా ఆచరించాలి?
సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఈ రోజున ఉపవసించడం ఎంతో ఉత్తమం. స్వామిని తులసి ఆకులతో పూజించాలి. దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించుకోవాలి. రోగులకు పండ్లను, దుప్పట్లను దానం చేయడం వల్ల కుటుంబంలోని దీర్ఘ కాలిక వ్యాధులు తొలగిపోతాయి. ఇంటిల్లిపాదీ ఆయురారోగ్యాలతో ఉంటారు. ఏకాదశినాడు జాగరణ చేసి, తెల్లవారి హరిపూజతో ఉపవాసాన్ని విరమించాలి. యోగినీ ఏకాదశి ఉపవాసంలో తీసుకోవలసిన ఆహరం: నీరు, పాలు, పండ్లు, ఒక్క పూట భోజనం (శాఖాహారం మాత్రమే).
‘హరిఓం డాట్కామ్’ సౌజన్యంతో.. యోగినీ ఏకాదశి వ్రత కథ
అలకాపురి నగరానికి అధిపతి అయిన కుబేరుని వద్ద ఎంతోమంది సేవకులు ఉండేవారు. వారిలో ఒకడు హేమమాలి అనే యక్షుడు. అతను ప్రతిరోజూ మానస సరోవరం వద్దకు వెళ్ళి అక్కడి కలువలను తెచ్చి శివపూజ వేళకు కుబేరునికి అందించాలి. అది అతని ఉద్యోగం. అతనికి స్వరూపవతి అనే సుందరితో వివాహం జరిగింది. కొత్తగా ప్ళ్ళునందున హేమమాలి భార్యను విడిచి ఉండడానికి ఇష్టపడే వాడు కాదు. కానీ, ఉద్యోగ ధర్మం తప్పక నిర్వర్తించేవాడు.
ఒకనాడు సరోవరం నుంచీ పూలను తెస్తూ నేరుగా కుబేరుని వద్దకు వెళ్లకుండా హేమమాలి తన భార్య మీది విరహంతో ఇంటికి వెళ్ళాడు. మధ్యాహ్నం కావొచ్చినా పూలు తెచ్చే హేమమాలి రాకపోయే సరికి కుబేరుని శివపూజకు వేల మించి పోసాగింది. మరొక సేవకుని పిలిచి విషయమడుగగా, అతను జరిగిన సంగతి కుబేరునితో విన్నవించాడు. కోపోద్రిక్తుడైన కుబేరుడు హేమమాలిని పిలిచి దూషించాడు. అంతేకాదు కుష్టురోగిగా భూలోకంలో జన్మించమని, భార్యకు దూరంగా శిక్షను అనుభవించమని శపించాడు.
హేమమాలి కుబేరుని శాపకారణంగా కుష్టువ్యాధిగ్రస్థుడై భూలోకంలో నానా యాతన పడ్డాడు.
తర్వాత ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. అలా సంచరించే క్రమంలో హిమాలయ పర్వత ప్రాంతంలో మార్కండేయ ఋషిని దర్శించాడు. దూరంగానే ఉంటూ ఆయనకు ఎన్నో సేవలు చేశాడు. అతని దుస్థితికి కారణమడిగి తెలుసుకున్న మార్కండేయుడు అతడిని ‘యోగినీ ఏకాదశి వ్రతాన్ని’ ఆచరించమని చెప్పాడు. యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్యంతో హేమమాలి శాపవిముక్తుడై తిరిగి తన లోకాన్ని చేరుకుని, భార్యతో ఆనందంగా జీవించాడు. ఈ వృత్తాంతాన్ని స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించాడు.