calender_icon.png 17 June, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాచీన ఆయుధ కర్మాగారం జగదేవపూర్

15-06-2025 01:30:00 AM

  1. అద్వితీయమైన శిల్పకళా చాతుర్యానికి ప్రతీక 
  2. ఆధ్యాత్మిక కేంద్రంగా త్రికూటాలయం

సిద్దిపేట జిల్లా పరిధిలోని జగదేవపూర్‌లో శతాబ్దాల క్రితం లోహ పరిశ్రమ వర్ధిల్లింది. మల్లన్న, వీరభద్రుడు, మమ్మాయి మాత అనే త్రికూటమూర్తుల ఆలయం మల్లన్నగుడిగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయం మధ్యయుగాలనాటిది. అప్పట్లో జగదేవపూర్‌కు కొలిమిగడ్డ అనే పేరుండేది. చరిత్రకారుల అంచనా ప్రకారం.. నాడు ఈ ప్రాంతంలో ఇనుప చిట్టెపురాళ్లు పోగుపడ్డాయి. ఇనుప పనిముట్లు, ఆయుధాల తయారీకి చిరునామాగా జగదేవపూర్ నిలిచేది.

నిత్యం కొలిములు రగులుతుండగా, ఆయుధ సామగ్రి తయారవుతుండగా రోజుకు వందలాది కిలోల నల్లని బూడిద బయటకు వచ్చేది. అలా ఊరు చివర ఆరడుగుల ఎత్తు మేర బూడిద కుప్పలు పోగుపడేవి. ఊరిలోని మల్లన్న గుడిలోని మమ్మాయి మాతను పంచానన కులానికి చెందిన విశ్వబ్రాహ్మణులు ఆరాధించేవారు. ఆయుధ సామగ్రి తయారీకే కాక, ఈ ఊరు మమ్మాయి మాత ఆరాధన, పూజలకూ ప్రసిద్ధిగాంచింది.

గ్రామంలోని దేవతా శిల్పం 17వ శతాబ్దం నాటిది. కాలక్రమంలో కొందరు ఆ విగ్రహాన్ని మల్లన్న గుడిలోకి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. త్రికూటాలయంలో ప్రధాన దేవుడైన మల్లన్నకు ఖండేల రాయుడనే మరోపేరున్నది. మల్లన్న తనకు ఇరువైపులా బలిజ మేడమ్మ, గొల్ల కేతమ్మతో పరివేష్టితుడై గుడిలో వెలిశాడని ఆలయ పురాణం చెప్తున్నది. మల్లన్న పాదాల కింద మణి మల్లాసురుల శిరస్సుల శిల్పాలు కనిపిస్తుంటాయి. గర్భగుడిలో మల్లన్నతో పాటు శివలింగం ప్రతిష్ఠించి ఉండటం ఆలయ ప్రత్యేకత. ఆలయంలోని గణపతి శిల్పం కూడా ప్రత్యేక ఆకర్షణ.

కాకతీయుల శిల్పకళా చాతుర్యం..

త్రికూటాలయంలోని ఒక గుడిలో కాకతీయ కాలం నాటి శైలి వీరభద్రుని శిల్పం ఉన్నది. పర(వెనక) హస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలు, నిజ (ముందరి) హస్తాల్లో ఖడ్గం, డాలులతో ద్విభంగిమ, ఎత్తున పాంకోళ్లతో చతుర్భుజుడైన వీరభద్రుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. మరొక గుడిలో గణపతి లలాటబింబంగా ఉండే గర్భగుడిలో అమ్మదేవత విగ్రహం ప్రతిష్ఠించి ఉన్నది. ఈ శిల్పం దేవత చతుర్భుజి. ప

రహస్తాల్లో త్రిశూలం, ఢమరుకాలు, నిజ హస్తాల్లో (విరిగివున్నాయి) కుడి చేతిలో కత్తి (పిడి) ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎడమ చేతిలో రక్తపాత్ర ఉంది. దేవతా మూర్తి లలితాసనంలో ఆశీనురాలై ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె అధిస్ఠాన పీఠంపై మూడు తలలున్నాయి. వాటి కింద ఒంటె వాహనం, పనిముట్టుతో విశ్వకర్మ (పంచాననంలో ఒకరు) అర్చకుడిగా కనిపిస్తున్నాడు. ఈ శిల్పం మమ్మాయి దేవతది. శిల్ప శైలినిబట్టి విగ్రహం 17, 18వ శతాబ్దాల నాటిదని ద్యోతకమవుతుంది. 

మమ్మాయి ఆరాధన..

జగదేవపూర్‌లో ఇనుము పరిశ్రమ వెలసిల్లిందనడానికి గుర్తు మమ్మాయి దేవత ఆరాధన. సాక్షాత్తు విశ్వకర్మల దేవత మమ్మాయి. కమ్మరులు ప్రతిష్ఠించుకున్న దేవత ఆమె. త్రికూట ఆలయంలోని మండప స్తంభాలు అశ్వపాదాలు, చతురస్రాలు, అష్టముఖ ఫలకాలు, పోదికలను బట్టి ఇవి 17, 18వ శతాబ్దాలనాటివని అనిపిస్తున్నది. మూడు గుడుల లోకప్పుల్లో కనిపిస్తున్న భువన శిల్పాల్లో షట్కోణ యంత్రగర్భంలో అష్టదళ పద్మం చెక్కి ఉన్నాయి.

ముఖ పట్టకం, మెడలో మూడు వరుసల మువ్వలు, గంటలు, మూపుమీద దర్భముడితో రెండువైపులా అలంకరించిన మువ్వల పట్టెడలు కీర్తిముఖాలతో చాళుక్య శిల్ప శైలిలో నంది కనిపిస్తున్నది. గుడి బయట కనిపిస్తున్న ఒక రాతి ఫలకంపై ఏనుగులు అర్చిస్తున్న శివలింగం ఒకటి ఉంది. ఇలాంటి ఫలకం శైవమఠాల గుడి లలాటబింబంగా ఉంటుంది.

ప్రధాన ఆలయంలో శివలింగంపై సూర్యకిరణాలు పడేందుకు పైకప్పులో ప్రత్యేకంగా ఒక కంత ఏర్పాటు చేయబడివున్నది. ఈ ఆనవాళ్లను బట్టి పూర్వం ఈ త్రికూటం శైవుల మఠంగా ఉండి, తర్వాత 17, 18వ శతాబ్దాల్లో మల్లన్నగుడిగా  మారిందని, ఈ క్రమంలోనే ఆలయంలోకి వీరభద్రుడు, మమ్మాయిల విగ్రహాలు చేర్చినట్లు తెలుస్తున్నది.