03-02-2026 12:38:11 PM
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. అభ్యర్థుల క్రమ సంఖ్య తెలుగు అక్షరమాల క్రమానుసారమే ఉండేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, వార్డుల వారీగా దాఖలైన నామినేషన్ల జాబితాలను పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తుల కేటాయింపు జరగాలని స్పష్టం చేశారు.
నామినేషన్ ఉపసంహరణకు అభ్యర్థులు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని, ప్రతినిధుల ద్వారా సమర్పించిన పత్రాల విషయంలో తప్పనిసరిగా అభ్యర్థితో నిర్ధారణ చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ పార్టీల అభ్యర్థుల బీ-ఫారమ్లను పరిశీలించి, ఫారం–ఏ ఆధారంగా సమర్పించారా లేదా అని తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉందని, ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసిల్దార్ తబితా రాణి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.