కొమ్ముగూడెంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సోయం సత్యవతి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపశిల్పి, సామాజిక విప్లవకారుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం పాల్గొని చిత్రపటానికీ పూలు చల్లి పుష్పాంజలి ఘటిoచారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, సమానత్వ సాధనే శ్వాసగా పోరాడారని, నేడు సమాజంలో అంబేద్కర్ ఆంధిoచిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. కేవలం రాజ్యాంగకర్తగానే కాకుండా, అర్థశాస్త్రజ్ఞుడిగా, న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా అంబేద్కర్ చేసిన సేవలు అనన్యసామాన్యమనీ, కుల, మత రహిత సమాజం కోసం అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.






