07-06-2025 01:34:07 AM
వామపక్షాల ధర్నా
మహబూబాబాద్, జూన్ 6 (విజయ క్రాంతి): చత్తీస్ ఘడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేర సాగిస్తున్న నరమేధాన్ని వెంటనే నిలుపుదల చేసి, కాల్పుల విరమణను ప్రకటించాలని, తక్షణమే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని వామపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
శాంతి చర్చల కమిటీ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో సీపీఐ, సీపీఎం, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే మదార్ ప్రసంగిస్తూ గత 18 నెలలుగా మధ్య భారత అడవుల్లో భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో హత్యాకాండను కొనసాగిస్తోందన్నారు.
అబూజ్ మడ్లో ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 25కు పైగా మృతి చెంది 15 రోజులు గడవక ముందే మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ను కేంద్ర మిలిటరీ బలగాలు నిన్న హత్య చేశాయని ఆరోపించారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరిందని, ఆపరేషన్ కగార్ ని ఆపివేయాలనీ, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఈ ధర్నాలో మున్సిపల్ ఫ్లోర్ సీపీఐ మాజీ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న, సీపీఐ జిల్లా నాయకులు పెరుగు కుమార్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు భాస్కర్ రెడ్డి లు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, సీపీఎం జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారాం, కుమ్మరికుంట్ల నాగన్న, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర జిల్లా నాయకులు బండారి ఐలయ్య, నందగిరి వెంకటేశ్వర్లు, జడ సత్యనారాయణ, హలావత్ లింగ్యా, గుజ్జు దేవేందర్, గుగులోత్ సక్రు, బండపల్లి వెంకటేశ్వర్లు, బానోతు లింగ్య నాయక్, మాలోతు రవీందర్, ఆబోతు అశోక్, వంకాయలపాటి చిరంజీవి, జలగం ప్రవీణ్, మల్లికార్జున్, గాదం శ్యాం, ప్రసాద్ యాదవ్, బి.రమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.