అంగన్వాడీ కేంద్రాల సేవలను విస్తృతపరచాలి: -ఎమ్మెల్యే బీఎల్ఆర్
మిర్యాలగూడ, ఏప్రిల్ 8 : సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్ వాడీ కేంద్రాల సేవలను లబ్ధిదారులకు మెరుగైన, నాణ్యమైన, పారదర్శకమైన సేవలందించేందుకు విస్తృతపరచాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్అర్ ) అన్నారు. బుధవారం మిర్యాలగూడ అర్బన్ సిడిపిఓ రేఖల మమత ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని 194 మంది అంగన్ వాడీ టీచర్లకు ఎన్ హెచ్ టి ఎస్, పోషణ ట్రాకర్ యాప్ లను పొందుపర్చేందుకు సెల్ ఫోన్ లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పేదలకు అందజేసేందుకు, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా నూతన సాంకేతికతో అంగన్ వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకందిస్తున్న సేవలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సంబంధించిన ప్రతి డాటా ను ఈ యాప్ లో పొందుపరచాలన్నారు.
అనంతరం 251 అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు రాధిక, నాగమణి, నజీమా బేగం మహమ్మద్, వాణి,హేమాదేవి,పద్మ, నిహారికలతో పాటు అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.




