25 April, 2026 | 3:21 AM

ప్రీస్కూళ్లుగా అంగన్‌వాడీలు

27-06-2024 12:05 AM
  • ఆంగ్ల మాధ్యమంలో బోధన

విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు

మంచిర్యాల, జూన్ 26(విజయక్రాంతి) : నిరుపేదలకు సర్కారు విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 2030 నాటికి ప్రభుత్వ సూళ్లను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించింది. సీడీపీవోలకు, సూపర్‌వైజర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. అంగన్‌వాడీ సెంటర్లను ఆశ్రయిస్తున్న చిన్నారులకు యూనిఫాం కూడా అందించనుంది. 

ఒక్కొక్కరికి రెండు జతలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్‌ల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 969 అంగన్ వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో 3 ఐదేండ్లలోపు చిన్నారులు 16,916 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున యూనిఫాం అందించనున్నారు.  ఇందుకు అవసరమైన క్లాత్ జిల్లా కార్యాలయానికి ఇప్పటికే చేరుకుంది. ఇదిలా ఉండగా, పిల్లలకు అవసరమైన పుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. అంగన్ వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య కరదీపికతోపాటు చిన్నారులకు బోధించేందుకు ప్రియదర్శిని పూర్వ ప్రాథమిక వాచకం  1 పేరిట పుస్తకాలు అందుబాటులో ఉంచారు.  

పకడ్బందీ బోధన

ఐదేండ్లలోపు పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు గత నెల 27 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. కేంద్రాల నిర్వహణపై మార్గదర్శకాలను వివరించారు.  ప్రస్తుతం అంగన్ వాడీ టీచర్లకు అవగాహన తరగతులు జరుగుతున్నాయి. క్లస్టర్ స్థాయిలో ప్రతి మూడు రోజులకు ఒక అంగన్ వాడీ బృందానికి శిక్షణ ఇవ్వాలని, ప్రతి బృందంలో 30 నుంచి 35 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.