04-06-2025 12:44:12 AM
మూడు ఏళ్ల కిందట భార్య సూసైడ్
ఇప్పుడు గుండెపోటుతో బిక్షపతి హఠాన్మరణం
అనాథలుగా మారిన ఇద్దరు కూతుర్లు
గజ్వేల్, జూన్ 3 : త్రిబుల్ ఆర్ లో కోల్పోతున్న తన భూమికి తక్కువ పరిహారం వస్తుందని బెంగతో దివ్యాంగుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ఎంబరి బిక్షపతి (42) తనకున్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బిక్షపతి కి నాలుగు రోజుల ముందు భూ సేకరణకు సంబంధించిన నోటీసులు అధికారులు అందించారు.
మార్కెట్ లో తన భూము లకు కోటి రూపాయల పైన ధర ఉంటే ప్రభుత్వం కేవలం రూ. 8 లక్షలు మాత్రమే ఇస్తామని నోటీసులో పేర్కొనడంతో గత రెండు రోజుల నుండి మనోవేదనకు గురయ్యారు. సోమవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. మృతుని భార్య కూడా మూడేళ్ల కిందట చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లు నిత్య (10),రితిక (8) అనాధలయ్యారు.
బిక్షపతి కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ గ్రామస్థులు ప్రజ్ఞాపూర్ - జగదేవ్పూర్ రహదారిపై నరసన్నపేట కూడలి వద్ద ధర్నా చేశారు. త్రిబుల్ ఆర్లో భూము లు పోయిన వారికి తగిన నష్ట పరిహారం ఇవ్వకపోతే ఎక్కడికైనా వెళ్తామని, రైతుల గోస ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఆందోళన కారులను గజ్వేల్ ఏసిపి నర్సింలు అదుపు చేయడానికి ప్రయత్నించినా వారు వినలేదు.
మర్కుక్ తహసిల్దార్ ప్రవీణ్ రెడ్డి ధర్నా ప్రాంతానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. మృతి చెందిన దివ్యాంగుడు బిక్షపతి పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని, నష్టపరిహారం పెంపుపై కలెక్టర్ తో చర్చించాల్సి ఉంటుందని ఎందుకు తాను కూడా వస్తానని వెల్లడించారు. దీంతో ధర్నాను విరమించారు.