calender_icon.png 24 July, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి

23-07-2025 07:23:50 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల టౌన్ : రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్దకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని అన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు,యూరియా,ఎరువులు ఇబ్బంది కలగకుండా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోదాంలోని స్టాక్‌ పరిశీలించి నిల్వల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, నాణ్యతలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్  ఈ-పాస్ యంత్రములో నమోదు  ప్రక్రియను పరిశీలించి వివరాలు సమగ్రంగా ఉండాలని సూచించారు. ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ కార్డు వివరాలను సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు.

ప్రైవేటు డీలర్ల వద్ద రైతులు అధిక ధరలకు కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల కొరత తలచకుండ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్  మల్దకల్ కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో స్టాక్, బిల్లులు,లైసెన్సులు,నిబంధనల ప్రకారం నమోదులు తదితర అంశాలను పరిశీలించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులే కాక డీలర్లపై కూడా ఉందని తెలిపారు. ఎరువుల స్టాక్‌ వివరాలు బోర్డుపై స్పష్టంగా ప్రతిరోజూ ప్రదర్శించాలనీ అన్నారు. స్టాక్ బోర్డులోని సమాచారం నిజమైన నిల్వలకు సరిపోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని స్టాక్ వివరాలు కచ్చితంగా రిజిస్ట్రార్ లో నమోదు చేయాలని, ఎరువుల ధరలు నియమాలకు లోబడే ఉండాలని అన్నారు. అన్ని విక్రయాలు ఈ పాస్ యంత్రం ద్వారా మాత్రమే జరగాలని, లైసెన్స్ లేకుండా అమ్మకాలు చేయరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్ ఝాన్సీ, పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు తిమ్మ రెడ్డి,వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు  సంగీతలక్ష్మి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.