18-05-2025 12:28:35 AM
అధికార పార్టీ నేతలు, మంత్రులు చేసే వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బల్లెంలా సూటిగా తాకాలి.. కానీ కాంగ్రెస్పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షానికి కాకుండా అధికార పక్షానికే పక్కలో బల్లెంలా మారాయని సెటైర్లు వేస్తున్నారు.
‘మంత్రులంతా ఫైళ్లపై సంతకం చేసేందుకు డబ్బులు తీసుకుంటారు కానీ నేను నిజాయతీపరురాలిని పైసా తీసుకోకుండా సంతకం చేసి పంపిస్తా..’అని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ‘ఆమె ఒక్కరే నిజాయతీపరురాలు..మేం అవినీతి పరులమా..’ అన్న చందంగా ఆమె వ్యాఖ్యలున్నాయని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
గతంలోనూ నాగార్జున కుటుంబానికి సంబంధించిన అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిన మంత్రి..ఇప్పుడు మంత్రులంతా లంచగొండులన్నట్లుగా పేర్కొనడం కాంగ్రెస్ పార్టీకి లేని తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఈ అంశంలో గత ప్రభుత్వ మంత్రులపై చేసిన వ్యాఖ్యలని మంత్రి సురేఖ వివరణ ఇచ్చుకున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.