18-05-2025 12:28:47 AM
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): మన దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని మాజీ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్య నాయు డు స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్థాన్ భారతదేశానికి అప్పగించక తప్పదని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్లో భారత్ విజయాన్ని పురస్కరించుకొని, మన వీర జవాన్ల పోరాట పటిమను శ్లాఘిస్తూ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై శనివారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయు డు మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ ఎంతో విలక్షణమైనదని చెప్పారు.
మన సైనికులు పాక్ భూ భాగంలోకి ప్రవేశించకుండానే, 25 నిమిషాల్లోనే పీవోకే, పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, మన దేశ సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు. స్వీ య రక్షణ కోసమే మనం ఆయుధ సంపత్తిని, ఆయుధ పరిజ్ఞానాన్ని దాచిఉంచుతు న్నామే తప్పా, విస్తరణకాంక్ష మనకెన్నడూ లేదని స్పష్టం చేశారు.
‘ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడానికి నిర్వహించిన ఆపరేషన్ సిందూర్.. ప్రపంచ చరిత్రలోనే విలక్షణమైంది. ఈ ఆపరేషన్తో భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచమంతా గుర్తించాయి. మన వీర సైనికుల పోరాట పటిమ అనన్య సామాన్యం’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమైక్యంగా ఉండటమే అమర జవాన్లకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న త్రివిధ దళాల సైనికులకు, శాస్త్ర సాంకేతిక బృందానికి, శాస్త్రవేత్తలకు, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. తిరంగా యాత్రను విజయవంతంగా నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఇతర బృందానికి, యాత్రకు వేలాదిగా తరలివచ్చిన భాగ్యనగర ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
ఉత్సాహభరితంగా తిరంగా ర్యాలీ...
ట్యాంక్బండ్పై ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్ర అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా, పోరాటయోధుల పరాక్రమాన్ని అభినందించేలా, శాస్త్రవేత్తల మేథోసంపత్తికి జోహార్లు అర్పించేలా, ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ పటిష్ఠ నాయకత్వాన్ని, గొప్పదానాన్ని కీర్తిస్తూ యావత్ తెలంగాణంతా మీ వెంట ఉంటుందని చెప్పేలా తిరంగా యాత్ర కొనసాగిం ది. ఈ యాత్రకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
భారీ జనసందోహంతో ట్యాంక్బండ్ పరిసరాలు కిటటికలాడాయి. మాజీ ఉపరాష్ర్టపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మాజీ కేంద్రమంత్రి సీహెచ్ విద్యా సాగర్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మండలి బీజేపీ పక్షనేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, డీకే అరుణ, ఈటల రాజేందర్, గోడం నగేశ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, గౌతమ్రావు, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్రెడ్డి, జమ్మూకశ్మీర్ మాజీ డీజీలు రాజేంద్రకుమార్, గోపాల్రెడ్డి, సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కృష్ణారెడ్డి, సమ్మక్క యూనివర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్, ప్రముఖ నటి జయప్రద, సినీహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నటి మంచు లక్ష్మి, సినీ గేయ రచయిత, గాయకుడు వందేమాతరం శ్రీనివా స్, ప్రముఖ గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు.