16-02-2025 12:00:00 AM
చాలామందికి టీవీ చూస్తూ అన్నం తినడం అలవాటుగా మారింది. తినేటప్పుడు టీవీ చూడొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ వాళ్ల మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలకు తల్లిదండ్రులే ఫోన్, టీవీలు చూస్తూ తినిపిస్తుంటారు. ఇది వాళ్లకు అస్సలు మంచిది కాదు. టీవీ లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తినేటప్పుడు ఫోన్, టీవీ చూస్తే.. స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. టీవీ చూస్తూ తినే పిల్లల్లో మధుమేహం ఎక్కువగా వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. టీవీ, ఫోన్ చూస్తూ తినడం వల్ల అన్నం ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయట.
అలాగే శరీర బరువు పెరిగే కొద్దీ కొవ్వు శాతం రెట్టింపు అవుతుంది. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది. అంటే కాకుండా కళ్లు బలహీనపడటం, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ ఇలా అనేక సమస్యలను వస్తాయి. ఇలా టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల వాళ్లు ఏం తింటున్నారో దానిపై ఏకాగ్రత ఉండదు.
అన్నం కూడా నమలకుండా తొందరగా మింగేస్తారు. దీంతో అరుగుదల సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎదుటివారితో సంబంధాలు కూడా ఉండవు. వాళ్ల సమస్యలను కుటుంబసభ్యులతో షేర్ చేసుకునే సమయం కూడా ఉండదు. ఎవరి ప్రపంచం వారిదే అన్నట్టుగా ఉంటారు.