11-06-2025 12:21:46 AM
సుమారు రూ.65 లక్షల విలువ చేసే
22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
ఆరుగురు నిందితుల అరెస్ట్
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కేసులో 4 గురు, మోతేలో కేసులో
ఇద్దరు నిందితులు వివరాలు వెల్లడించిన ఎస్పీ కే నరసింహ
సూర్యాపేట, జూన్ 10 (విజయక్రాంతి): రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి సుమారు రూ.65 లక్షల విలువ చేసి 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత ఆరుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో పాతర్లపాడు బస్ స్టేజి వద్ద సోమవారం సిసిఎస్ పోలీస్ లు, ఆత్మకూరు (ఎస్) పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో బైక్ పై ఒక వ్యక్తి గోనెసంచిని వేసుకొని వస్తు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. దీంతో ఆ వ్యక్తి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంకు చెందిన తండా నగేష్ గా వివరాలు తెలిపారన్నారు.
అతని నుండి 120 ప్యాకెట్లు కలిగిన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు సేకరించామన్నారు. ఇతను ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన ఏ 3 నిందితుడు పంది రాముల వద్ద విత్తనాలు తెస్తున్నట్లు ఒప్పుకున్నాడన్నారు. ఈ విత్తనాలు గడ్డి మందు తట్టుకునేవని, అధిక దిగుబడిని ఇచ్చేవి అంటూ రైతులను మోసం చేస్తున్నట్లు గుర్తించి నిందితుడు పంది రాములను అతని గ్రామంలో అదుపులోకి తీసుకుని ఇతని వద్ద 120 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇతనికి విత్తనాలు సరఫరా చేస్తున్న ఏ4 బానోతు జయరాంకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవరంలో విత్తనాల దుకాణం ఉన్నది, ఈ దుకాణం వద్దకు గుంటూరు టౌన్ బాలాజీనగర్ కు చెందిన ఏ5 నిందితుడు తరిగొప్పల శ్రీనివాసరావు రాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే జయరాం షాపులో నిల్వచేసిన 37 బస్తాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోగా దీనిలో ఒక్కొక్క బస్తాలు 120 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు ఉన్నాయన్నారు.
ఈ విత్తనాల విలువ సుమారు రూ.63 లక్షలు ఉంటుందన్నారు. ఈ విత్తనాలు జిల్లా మొత్తంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకుని విత్తనాలు రైతులకు చేరకుండా చేశాము. కాగా బాపట్ల జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన ఏ1 మాగులూరి సాంబశివరావు ఎండిగా వ్యవహరిస్తూ అరుణోదయ అనే కంపెనీ పేరిట నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
అలాగే కర్నూలు జిల్లా పల్లిపాడుకు చెందిన ఏ6 చెవుల నరసింహులు పరారీలో ఉన్నారు. వీరిరువురిని త్వరలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తామన్నారు. మోతె పోలీస్ స్టేషన్ పరిధిలో : నమ్మదగిన సమాచారంపై సిసిఎస్ పోలీసులు, మోతే పోలీసులు సంయుక్తంగా రావి పహాడ్ గ్రామంలో వెలుగు శ్రీను ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా అక్కడ అడ్వాన్స్ 333, అరుణోదయ అనే కంపెనీ పేర్లుగల 98 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితున్నే విచారించగా తనకు బంధువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహన అనే నిందితునితో కలిసి మోతే మండల పరిసర గ్రామాలలో, జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఈ విత్తనాలు గడ్డి మందును తట్టుకునేవి అని అధిక దిగుబడిన ఇచ్చే మంచి రకం పత్తి విత్తనాలు అని నమ్మించి రైతులకు ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నామని తెలిపాడన్నారు.
దీంతో ఏ2ను అరెస్టు చేసి 30 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరికి ఈ విత్తనాలు సరఫరా చేస్తున్న ఏ3 నిందితుడు తిరుమల్ కర్ణాటక రాష్ట్రం నలుగునూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించి ఇతనిని పట్టుకోవడానికి పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈకేసులో రూ.2.లక్షల విలువ 58 kg ల నకిలీ విత్తాలు సీజ్ చేసినట్లు తెలిపారు.
ఈ.నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులలో బాగా పని చేసిన సిసిఎస్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్ , ఎస్త్స్ర హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ లు విద్యాసాగర్ రావు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, కర్ణాకర్, కానిస్టేబుల్ ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, ప్రభాకర్, మహిళా హోమ్ గార్డ్ మంజుల, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, ఆత్మకూర్ యస్ ఎస్త్స్ర శ్రీకాంత్, మోతే ఎస్ఐ యాదవెందర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్న కుమార్, సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ, సిసిఎస్ సిబ్బంది, మోతే, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.