రోడ్డు భద్రత సామాజిక బాధ్యతగా భావించాలి
మంగపేటలో అరైవ్ అలైవ్ కార్యక్రం
మంగపేట,(విజయక్రాంతి): రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ములుగు జిల్లా మంగపేట ఎస్సై టి.వి.ఆర్.సూరి, రెండవ ఎస్సై శ్రీకాంత్ లు అన్నారు. మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణా సెంటర్ లో మంగపేట పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం అరైవ్ అలైవ్ (రోడ్డుభద్రత)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న అరైవ్ అలైవ్ (రోడ్డు భద్రత) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, వాహనదారులతో, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మంగపేట ఎస్సై టి.వి.ఆర్. సూరి, రెండవ ఎస్సై శ్రీకాంత్ లు మాట్లాడుతూ ఒక్క చిన్న తప్పిదం కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతున్నదని అన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి ప్రాథమిక నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించడం అని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు, వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.




