సుల్తానాబాద్లో అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారత రత్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణానికి చేరుకున్న ఎంపీ వంశీ కృష్ణ కు అంబేద్కర్ ఉత్సవ కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుంది అన్నారు.
కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా డీలిమిటేషన్ చేయాలని, అందరికీ సమాన న్యాయం కల్పించే విధంగా డీలిమిటేషన్ ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పార్లమెంట్ లో మేము పోరాటం చేస్తాం అని, పార్లమెంటులో మన రాష్ట్రానికి న్యాయం జరిగేలా డిలిమిటేషన్ పై తెలంగాణ గళం విప్పుతాం అని చెప్పారు,అందరికీ సమాన హక్కులు రాజ్యాంగం మనకు కల్పించింది.బడుగు బలహీన వర్గాల కోసం మేమెప్పుడూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అని గడ్డం వంశీకృష్ణ తెలిపారు.




