10-06-2025 12:00:00 AM
హీరోయిన్ జ్యోతిక భాషతో సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో కనిపిస్తూ సినీప్రియులను అమితంగా అలరించింది. ఇటీవల ‘కాథల్ ది కోర్’, ‘డబ్బా కార్టెల్’ వంటి శక్తిమంతమైన కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె అందరి మెప్పు పొందింది. ఇప్పుడు ఓ కోర్టు రూమ్ డ్రామాతో రానుందని తెలుస్తోంది. జ్యోతిక సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం..
అమెజాన్ ప్రైమ్ వేదికగా రాబోతున్న ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ షూటింగ్ పనులను చిత్రబృందం ఇప్పటికే ప్రారంభించింది. ఈ సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్రలో కనిపించనుండగా, సోనాక్షి సిన్హా మరో కథానాయికగా కనిపించనుంది. ఇందులో జ్యోతిక, సోనాక్షి మధ్య కోర్టులో ముఖాముఖి సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి.
‘బరేలీ కీ బర్ఫీ’ ఫేమ్ అశ్విని అయ్యర్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిధ్వానీ నిర్మిస్తున్నారు. భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.