10-06-2025 02:08:22 PM
ఔను నన్ను చూసుకుని నాకు పొగరు
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు వేడుకలు బసవతారకం ఆస్పత్రిలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ... నంబర్ పెద్ద విషయం కాదు.. నా వయసు అందరికీ తెలిసిందే అన్నారు. తల్లిదండ్రుల దీవెనలతో 64 ఏళ్లు పూర్తి చేసుకున్నానని తెలిపారు. మా నాన్న కోరిక మేరకు ఒకసారి మెడిసిన్ ఎంట్రెస్ రాశానని గుర్తుచేసుకున్నారు. మెడిసిన్ చదవలేదు కానీ.. సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేశారని బాలయ్య పేర్కొన్నారు. 15 ఏళ్ల క్రితం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఛైర్మన్ అయ్యానని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేలా కృషి చేస్తున్నామని బాలకృష్ణ(Balakrishna) వివరించారు. బాలకృష్ణ అంటే ఏమిటో ఇక నుంచి చూపిస్తాను.. నాకు చాలా పొగరని అనుకుంటారు.. ఔను నన్ను చూసుకుని నాకు పొగరు అన్నారు. బిరుదులకు నేను అలంకారమేమో గానీ.. బిరుదలు నాకు అలంకారం కాదన్నారు. బిరుదులు వస్తుంటాయి.. కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలని ఆయన సూచించారు. కళా రంగానికి చేసిన సేవలకు గాను బాలకృష్ణను ఈ సంవత్సరం పద్మభూషణ్(Padma Bhushan)తో సత్కరించారు.
ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (Nandamuri Taraka Rama Rao) కుమారుడు, బాలకృష్ణ 14 సంవత్సరాల వయస్సులో బాల నటుడిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 100 కి పైగా చిత్రాలలో నటించాడు. జూన్ 10, 1960న మద్రాసులో జన్మించిన బాలకృష్ణ, 14 సంవత్సరాల వయసులో 1974లో విడుదలైన తెలుగు చిత్రం ‘తాతమ్మ కల’తో సినీరంగ ప్రవేశం చేశారు. బాలకృష్ణ 2014లో ఎన్నికల రాజకీయాల్లోకి దూసుకెళ్లి తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో ఆ స్థానాన్ని నిలుపుకుని 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు. బాలకృష్ణ మేనల్లుడు, ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao Jr), కళ్యాణ్రామ్, చంద్రబాబు నాయుడు మేనల్లుడు, నటుడు నారా రోహిత్, ఇతర సినీ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.