calender_icon.png 24 June, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లకారాల్లో వేలం!

24-06-2025 01:37:15 AM

కాలేజీకో రేటు.. ఇంజినీరింగ్ సీటు

  1. మెరిట్‌ను పక్కనపెట్టి రేటు ఫిక్స్!
  2. సీఎస్‌ఈ ఒక్కో సీటుకు రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు..
  3. షెడ్యూల్ విడుదలకు ముందే సీట్లు భర్తీ

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ కాలేజీలు ఎప్పటి లాగే నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. బీ కింద మేనేజ్‌మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), దాని అనుబంధ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉండడంతో ఆ సీట్లను హాట్ కేకుల్లా ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నాయి. ఒక్కో కాలేజీ ఒక్కోలా రేటుతో వీటిని విక్రయిస్తున్న ఆరోపణలున్నాయి.

వేలం పాటలా ఒక్కో సీటు రూ.8లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముడుపోతున్నది. మరోవైపు, తమ పిల్లలకు కౌన్సె లింగ్‌లో మంచి కాలేజీల్లో సీటు వస్తుందో రాదోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు కాలేజీలు ఎంతంటే అంత ఫీజు ఇచ్చి సీట్ల ను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు, సీఎస్‌ఈ సీటు కోసమని ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీని సంప్రదిస్తే రూ.12 లక్షలని చెప్పినట్లు తెలిసింది.

దీంతో వారు మరోమాట మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశారు. ఇలా ఈ ఒక్క కాలేజే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో ఇదే పరిస్థితి. మంచి పేరున్న కాలేజీల్లో రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షలు మేనేజ్‌మెంట్ కోటా సీటుకు వసూలు చేస్తుంటే, ఆ తర్వాత స్థాయి కాలేజీల్లో రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.

మెరిట్‌ను ప్రకారం, ఇవ్వకుండా..

అవి కన్వీనర్ కోటా అయినా? మేనేజ్‌మెంట్ కోటా అయినా.. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ వచ్చాకనే సీట్లను భర్తీ చేయాలి. కానీ రాష్ర్టంలో ఎప్‌సెట్ ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి. సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలే కాలేదు. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను కాలేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి వెలువడక కాకముందే యాజమాన్య కోటా సీట్ల విక్రయాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు లక్షా ౧౫ వేలు వరకు సీట్లున్నాయి. ఇందులో 70 శాతం కన్వీనర్ కోటాలో సీట్లను ప్రభుత్వమే మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ విధానంలో భర్తీ చేస్తోంది. మిగిలిన 30 శాతాన్ని బీ కోటా కింద ఆయా కాలేజీలే భర్తీ చేసుకుంటున్నాయి. ఈ సీట్లను నిబంధనల ప్రకారం జేఈఈ మెయిన్/టీజీ ఎప్‌సెట్ ర్యాంకు/ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా కేటాయించాలి.

దీనికి ప్రభుత్వం నిర్దేశించిన కన్వీనర్ కోటా ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కొన్ని కాలేజీల్లో ఇంజినీరింగ్ కనిష్ఠ ఫీజు రూ.35 వేల నుంచి 45 వేలు ఉండగా, గరిష్ఠ ఫీజు రూ.1.50 లక్షల నుంచి 1.70 లక్షల వరకు ఉంది. కానీ, సీఎస్‌ఈ బ్రాంచీల్లో ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి 20 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

నిబంధనలివి..

కాలేజీలు మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలంటే మూడు భాషల దినపత్రికల్లో తొలుత నోటిఫికేషన్ జారీచేయాలి. దాంతోపాటు నోటిఫికేషన్‌లో బ్రాంచీల వారీగా మేనేజ్‌మెంట్, ఎన్నారై కోటా సీట్ల వివరాలను ప్రకటించాలి. దరఖాస్తు విధానం, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, చివరి గడువు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తులను నేరుగా, ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి స్వీకరించాలి.

దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎక్‌నాలెడ్జ్‌మెంట్ పత్రం కూడా కాలేజీలు అందించాలి. అంతేకాకుండా కోర్సుల వారీగా దరఖాస్తు చేసిన మొత్తం విద్యార్థుల జాబితాను కాలేజీ ఆఫీస్ నోటీస్ బోర్డులోనూ అతికించాలి. ఆ తర్వాత అభ్యర్థుల మెరిట్ జాబితాను రూపొందించి సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది తూతూ మంత్రంగానే జరుగుతోంది. ఎవరి ఇష్టానుసారంగా వారు సీట్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

దందాకు చెక్‌పెట్టని సర్కారు..

మేనేజ్‌మెంట్ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నాయి. కానీ ఈ కోటా సీట్ల భర్తీ అంశం ముందుకు సాగడంలేదు. సీట్ల దందాకు చెక్‌పెట్టేలా ఈ విద్యాసంవత్సరం నుంచి నీట్, కన్వీనర్ కోటా సీట్ల తరహాలో ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే సమర్పించింకది. కానీ ఇంతవరకు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకో లేదు. మరోవైపు ఇంజినీరింగ్ ఫీజుల నిర్ధారణ అంశం ఇంకా ఖరారు కాలేదు. పాత ఫీజులను భర్తీ చేయనున్నారు. ఈక్రమంలో ఆన్‌లైన్‌లో పారదర్శకంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ అంశం ఈ ఏడాది అటకెక్కినట్లే కనబడుతోంది.