24-06-2025 01:36:25 AM
బీసీ రిజర్వేషన్ల బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదే
బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల, చిరంజీవులు
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు సూచించారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే హైదరాబాద్లో అడుగుపెట్టాలని డిమాండ్చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం 18 నెలలు ఆగిన ప్రభుత్వం ఇంకో 18 రోజులు ఆగలేదా అని ప్రశ్నించారు. వచ్చేనెల నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై యూపీఏ పార్టీలు బీసీ రిజర్వేషన్ల పోరాడేలా కాంగ్రెస్ కృషి చేయాలని సూచించారు.
కులగణనలో బీసీ రిజర్వేషన్లు కల్పించడంతో తెలంగాణ దేశానికి రోల్డ్ మోడల్ అయిందన్న కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే దేశంలో మళ్లీ ఓల్డ్ మోడల్ అవుతుందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేయకపోతే రాష్ట్రమంతటా పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత కాంగ్రెస్, బీజేపీలదేనని స్పష్టంచేశారు.
బీసీ రిజర్వేషన్లపై అడగాల్సిన కాంగ్రెస్, అమలు చేయాల్సిన బీజేపీ తమ బాధ్యతలను విస్మరించి బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని చూపుతున్నాయని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీల ఆమోదం ఉండదని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.
బీసీలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి పెంచాలన్నారు. లేదంటే బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి బీసీ మేధావుల మద్దతు కూడగడతామని వెల్లడించారు.