10-06-2025 12:44:52 AM
సంగారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): ఆటో డ్రైవర్ మానవత్వం చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..కల్హేర్ మండల కేంద్రానికి చెందిన సంఘగోని శ్రీనివాస్ గౌడ్ ఓ శుభకార్యానికై సంగారెడ్డి మల్కాపూర్ చౌరస్తాలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చి తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి కల్హేర్ వెళ్ళుటకు ఆదివారం మల్కాపూర్ చౌరస్తాలో ఆటో ఎక్కి సంగారెడ్డి కొత్తబస్ స్టాండ్ కు వచ్చాడు.
అయితే ఆటోలో బంగారు ఆభరణాలు, నగదు కలిగిన బ్యాగ్ ను ఆటోలో మరిచి వెళ్లిపోగా కొంత సమయం తరువాత గమనించిన ఆటో డ్రైవర్ షేక్ ఖదీర్ ఆ బ్యాగ్ ను సంగారెడ్డి టౌన్ పోలీసు స్టేషన్ లో అందించడం జరిగింది. తమ బ్యాగ్ పోయిందని గుర్తించిన శ్రీనివాస్ గౌడ్ నేరుగా పోలీసు స్టేషన్ కు రాగా పోయిందనుకున్న బ్యాగ్ ను చూసి సంతోషించారు.
ఈ విషయంలో ఆటో డ్రైవర్ షేక్ ఖదీర్ మానవత్వంలో బ్యాగును అందించడంతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, ప్రయాణికుడు సంఘగోని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.