31-05-2025 12:00:00 AM
స్వరాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సినీరంగ ప్రోత్సాహక అవార్డులను పునరుద్ధరించింది రేవంత్రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 2024 సంవత్సరాలకు సంబంధించిన సినిమాలకు అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పునఃప్రారంభించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు జ్యూరీ కమిటీలను నియమించింది.
ఇందులోభాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి సినీ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్పర్సన్ జయసుధ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత పదేళ్లకు సంబంధించి అంటే.. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించతలపెట్టిన గద్దర్ అవార్డులు సైతం వెల్లడయ్యాయి. ప్రముఖ నటుడు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ వెల్లడించారు.
ఈ విషయమై ఆయన చలనచిత్ర రంగాభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి శుక్రవారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినిమా అవార్డులు ఆపేశారు. అవార్డుల రూపంలో ప్రభుత్వ గుర్తింపు అవసరం. సీఎం రేవంత్రెడ్డి బాధ్యత తీసుకుని గద్దర్ అవార్డులను ప్రారంభించారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటిస్తున్నాం.
ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు మాత్రమే ప్రభుత్వం అవార్డులు ఇవ్వదలిచింది. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. వీటితోపాటు సినీరంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ఇస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ప్రజాకవి, దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు ఉంటుంది” అని తెలిపారు.
ఈ విజయం అభిమానులదే: విజయ్ దేవరకొండ
నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డుకు ఎంపిక అయినందుకు సంతోషిస్తున్నా. నాపై నమ్మకం ఉంచి.. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. 2016వ సంవత్సరానికి సంబంధించి రెండో ఉత్తమ చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపికైనందుకు ఆనందంగా ఉంది.
ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ విజయం నా అభిమానులకే చెందుతుంది. వారి ప్రేమాభిమానాలే నన్ను నిరంతరం నడిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగమైన కుటుంబసభ్యులు, దర్శకులు, ఇతర టీమ్ అందరికీ నా ధన్యవాదాలు.
దైవ నిర్ణయంగా భావిస్తున్నా: నందమూరి బాలకృష్ణ
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుత ఘడియలు ఒకవైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాలు అమృతోత్సవాలు జరుగుతు శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తిచేసుకున్న శుభ సందర్భం ఇంకో వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూఫణ్తో సత్కరించిన ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ ప్రకటించడం నా అదృష్టం.
దీన్ని దైవ నిర్ణయంగా, నా తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఇలాంటి ప్రతిష్టాత్మక పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, భగవంతుడి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.
బీఎన్రెడ్డి పురస్కారం గౌరవంగా భావిస్తున్నా: సుకుమార్
ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో నన్ను అంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా రంగంలో శిఖ రం లాంటి బీఎన్రెడ్డి పేరు మీద ఉన్న అవార్డుకు ఎంపిక కావడం మరింత గౌరవంగా అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, జ్యూరీకి కృతజ్ఞతలు. నా చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, నా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
సినీ అవార్డులపై రెండు ప్రభుత్వాలు అవగాహనకు రావాలి
సినీ అవార్డులను ఆం ధ్రప్రదేశ్లోనూ ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ అన్నారు. గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన మా ట్లాడారు. “ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలి. ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించాలి.
తెలంగాణలో ఈ సినిమాకు.. ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారి తీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ.. మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారు” అని పేర్కొన్నారు.
సంవత్సరాల వారీగా అవార్డుల వివరాలు (వరుసగా.. ప్రథమ, ద్వితీయ, తృతీయ)
2014
రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శీను
201౫
రుద్రమదేవి, కంచె , శ్రీమంతుడు
201౬
శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్
201౭
బాహుబలి 2, ఫిదా, ఘాజీ
201౮
మహానటి, రంగస్థలం , కేరాఫ్ కంచరపాలెం
201౯
మహర్షి, జెర్సీ, మల్లేశం
20౨౦
అల వైకుంఠపురములో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్
20౨౧
ఆర్ఆర్ఆర్, అఖండ, ఉప్పెన
20౨౨
సీతారామం, కార్తికేయ 2 , మేజర్
20౨౩
బలగం, హనుమాన్, భగవంత్ కేసరి
ఎన్టీఆర్ అవార్డ్ నేషనల్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్: మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్: సుకుమార్
నాగిరెడ్డి ఫిల్మ అవార్డ్: అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావ్ ఫిల్మ్ అవార్డ్: విజయ్ దేవరకొండ
రఘపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్: యండమూరి వీరేంద్రనాథ్