చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
డీజీపీ రవిగుప్త
రాజేంద్రనగర్, జూన్ 6 : నూతన చట్టాలపై ప్రతి పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్త పేర్కొన్నారు. నూతన చట్టాలకు అనుగుణంగా నేరం జరిగిన తీరు, నేరస్తులపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గండిపేట్ మండల పరిధిలోని రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో నూతన క్రిమినల్ చట్టాలపై నిర్వహించిన ఒక రోజు వర్క్షాపులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తున్న చట్టాలపై అవగాహనను కలిగి ఉండాలన్నారు.
చట్టాలపై అవగాహన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని సూచించారు. అనంతరం న్యూ క్రిమినల్ లాస్ యాప్ను ప్రారంభించారు. కాసేపు ప్రజెంటేషన్, ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం సెక్రటరీ డాక్టర్ జితేందర్, క్రిమినల్ లాయర్ ఏపీ సురేష్, అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బీస్ట్, సీఐడీ అదనపు డీజీపీ శిఖాగోయెల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.






