07-06-2025 06:05:12 PM
అనంతగిరి: మండల కేంద్రంలోని రైతువేదికలో 'వికసత కృషి అభియాన్(Viksit Krishi Abhiyan)' శిక్షణ కార్యక్రమం నిర్వహించి నూతన వ్యవసాయ పద్ధతులపై దృష్టి సాధించాలని శాస్త్రవేత్తలు, రైతులు శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తే ఆదాయాలు పెరుగుతాయని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు పంటలు సాగు చేసుకోవాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ అర్ గోబినాథ్, కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ తెలిపారు.
రైతులకు రాపిడ్ మినీ సాయిల్ టెస్టు కిట్ ద్వారా మట్టిని పరీక్షించి రైతులకు పోషక లభ్యతను వివరించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ... రానున్న ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని పంటల సాగులో సుస్థిరమైన పద్ధతులు, శాస్త్రీయతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పంట ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై రైతులు దృష్టి సారించాలన్నారు. రసాయన ఎరువుల పై ఖర్చు తగ్గించి, సేంద్రియ వ్యవసాయం వైపుకు రైతులు మళ్ళాలని అన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై, వరిలో చీడపీడల యాజమాన్యంపై శిక్షణ కావాలి అని రైతులు కోరారు.
పంట మార్పిడి అవశ్యకత, వేసవి దుక్కులు వల్ల కలిగే లాభాలు, సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. కే.వి.కే నందు లభించే వివిధ కూరగాయల, పండ్ల మొక్కల గురించి వివరించారు. వివిధ రకాల జీవన ఎరువుల వాడటం వలన ఉపయోగం, వాడకంలో రైతులకు కలిగే లాభాలను తెలిపారు. ఎరువుల సమతుల్య వాడకం, చెరువు మట్టి తోలడం వలన ఉపయోగాలు, పచ్చిరొట్టల పంట ఆవశ్యకత,తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
వివిధ పంటలలో విత్తనోత్పత్తి లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల సాగులో ప్రధానంగా వరి, పత్తి ఇతర పంటల విత్తన ఎంపికలో మెళకువలు, కొనుగోలు సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు వివరించారు. వరి సాగులో వెదజల్లే పద్ధతి ద్వారా రైతుల పెట్టుబడి తగ్గించి దిగుబడి పొందవచ్చుని దాని వల్ల అధిక లాభాలు కలుగుతాయని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ అర్ గోబీనాథ్, కే . వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్, ఫీల్ ఆఫీసర్ సంతోష్ రైతులు దితరులు పాల్గొన్నారు.