మీ సురక్ష – సహచరి” సమావేశంలో పాల్గొన్న డీసీపీ శ్యామ్ సుందర్
మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించిన పోలీసులు
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మల్లాపూర్ అంబేద్కర్ నగర్లో నిర్వహించిన “మీ సురక్ష – సహచరి” సభ్యుల సమావేశానికి మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్యామ్ సుందర్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్, ఎస్ఐ మైబెల్లి, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సీడీ సుధా, ఉమెన్ సబ్ఇన్స్పెక్టర్ రాణి, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ రజని, మహిళా పోలీసు సిబ్బంది మరియు 50 మంది సహచరి సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, “మీ సురక్ష – సహచరి” కార్యక్రమం పోలీసు శాఖ చేపట్టిన కీలక కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమమని, ప్రతి సహచరి సభ్యురాలు సమాజంలో భద్రతా రాయబారిగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, ఫేక్ న్యూస్పై అవగాహన కల్పించడంలో సహచరి సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు.
ప్రజలు మరియు పోలీసుల మధ్య వారధిగా నిలుస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలు, సామాజిక సమస్యలు, నేరాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించడం ద్వారా సురక్షితమైన, నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సమావేశంలో కమ్యూనిటీ పోలీసింగ్, మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, అత్యవసర పోలీసు సేవల వినియోగం వంటి అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.






