19-12-2025 05:18:10 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలలో భౌతిక శాస్త్ర, కంప్యూటర్ సైన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో “Robotics in Academics”పై శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేటి సాంకేతిక యుగంలో రోబోటిక్స్ విద్యార్థులకు ఎంతో అవసరమైందని, విద్యా రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు.
ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర అధ్యాపకులు ఫర్హా యాస్మిన్ మాట్లాడుతూ రోబోటిక్స్ ద్వారా భౌతిక శాస్త్రంలోని సిద్ధాంతాలను ప్రాయోగకంగా అర్థం చేసుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుందన్నారు. కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు గులాం రసూల్ మాట్లాడుతూ రోబోటిక్స్లో ప్రోగ్రామింగ్, లాజికల్ థింకింగ్ కీలక పాత్ర పోషిస్తాయని, ఇలాంటి శిక్షణలు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయన్నారు.
కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు త్రివేణి మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై ఆసక్తి పెంచుకొని, పరిశోధన, ఆవిష్కరణల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోహం అకాడమీ సంతోష్, అజయ్, ఆదర్శ్ లు విద్యార్థులను ఉత్సాహ పరుస్తూ విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో ఉత్సాహభరితంగా కొనసాగించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు హరీష్, గంగయ్య, కుమార స్వామి, గోపాల్ కృష్ణ, రాజయ్య, మహేష్, కరుణాకర్, కనక లక్మి, మధు సుధన్, నవీన్, మంజుల, ఆహ్వానిత నిపుణులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.