27 February, 2026 | 2:08 PM

విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన సదస్సు

27-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): పిఎం విశ్వకర్మ లబ్ధిదారులు తాము ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం, ఇతర నిర్వహణ అంశాలపై యం ఎస్ యం ఈ , డీ ఎఫ్ వో హైదరాబాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం మహబూబాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డిజిటల్ మార్కెటింగ్, ప్యాకేజింగ్, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తుల వారికి అందిస్తున్న వివిధ రకాల రాయితీలు, లోన్ సదుపాయాలు, ఇతర అభివృద్ధి పథకాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిఎం శ్రీమన్నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పిఎం విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారు ఆర్థికంగా ఎదగడానికి గొప్ప అవకాశం ఉందని, సాంకేతికతను జోడించి తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ యాదగిరి, బీసీ కార్పొరేషన్ అధికారి శ్రీనివాసరావు, డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.