calender_icon.png 23 June, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి

23-06-2025 01:55:53 AM

- ‘బ్రహ్మ కుమారీస్’ ఆధ్వర్యంలో కార్యక్రమం

- ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ

- 18 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్న డాక్టర్ రఘురామ్‌కు ప్రశంసలు

హైదరాబాద్ సిటీ బ్యూరక్ష, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం రొమ్ము క్యాన్సర్ ఏబీసీఎస్ ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయాలు అనే కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గత మూడునెలల క్రితం మౌంట్ అబూలోని బ్రహ్మ కుమారీస్ ప్రపంచ ప్రధాన కేంద్రంలో ఆన్‌సైట్, ఆన్‌లైన్‌లో ‘అత్యధిక సంఖ్యలో రొమ్ము క్యాన్సర్ అవగాహన తరగతులు’ నిర్వహించి డాక్టర్ రఘురాం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారని చెప్పా రు.

ఆ తరగతిని నేడు హైదరాబాద్ శాంతి సరోవర్‌లో పునరావృతం చేయడం గొప్ప విషయం అని అన్నారు. గత ఐదేళ్లుగా అక్టోబర్ నెలలో తెలంగాణ రాజ్‌భవన్‌ను గులాబీ రంగులో వెలుగులు వెలిగించి అవగాహన కల్పిస్తున్న డాక్టర్ రఘురాం సేవలు అభినందనీయం అని పేర్కొన్నారు.

గత 18 ఏళ్లుగా ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలు దేశంలో రొమ్ము క్యాన్సర్ నిర్వహణ ను కొత్త దిశగా నడిపించాయని తెలిపారు. కిమ్స్ -ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పి రఘురాం అవగాహన ప్రసంగాన్ని నిర్వహించారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక కొత్త రొమ్ము క్యాన్సర్ కేసు, ప్రతి ఎనిమిదో నిమిషానికి ఒక మరణం జరుగుతోందని తెలిపారు.

భారతదేశంలో అవగాహన లోపం, స్క్రీనింగ్ లేకపోవడం వల్ల 60 శాతం కేసులు చివరి దశల్లోనే గుర్తిస్తారు అని వివరించారు. 40 సంవత్సరాల మధ్య రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తోందని చెప్పారు. ‘రొమ్ములపై అవగాన‘ అవసరమని, ఏవైనా మార్పులు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలని, 40 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

క్యాన్సర్‌ను జయించిన బ్రహ్మ కుమారీస్ హైదరాబాద్ కేంద్రాధిపతి బీకే కుల్దీప్ దీదీ తన అనుభవాన్ని పంచుకున్నారకు. డాక్టర్ రఘురాం ఇచ్చిన చికిత్స, శ్రద్ధ, సానుభూతితో నాకు ధైర్యం కలిగిందని చెప్పారు. గత మార్చి నెలలో మౌంట్ అబూలో జరిగిన రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డుల సాక్ష్యంగా గవర్నర్, ఇతర ప్రముఖులతో కలిసి ఫొటోలు తీశారు. ఈ రికార్డులు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్, బ్రహ్మ కుమారీస్ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సాధించబడ్డాయి.