calender_icon.png 10 June, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆయుష్’ తగ్గింది..!

21-05-2025 12:00:00 AM

-బాధ్యతలు పంచుకుంటూ ఒంటిపూట కొలువులు..

-డిప్యూటేషన్ పేరుతో ఉద్యోగానికి ఎగనామం

-నిత్యం ఆయుర్వేద ఆసుపత్రి మూత

-కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

-ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు.. 

-ఆయోమయంలో రోగులు..!

పెన్ పహాడ్, మే 20 : ’వైద్యో నారాయణో హరి’ కాదు.. కాదు.. ’వైద్యో కొలువు ఎగనామం హరి’. ఇది ముమ్మూటీకి నిజం అనే చెప్పవచ్చు. హరి నారాయణ సాక్షాత్తు సర్వరోగ నివారుడు అయితే.. వైద్యం చేసే డాక్టర్లు నారాయణుడి ప్రతి రూపంగా ఉంటారు. అలాంటి వృత్తిలో ఉన్న వైద్యులు, సహా వైద్య బృందం అందుకు విరుద్ధంగా ఉంటారనేది సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాలను చూస్తే ఇట్టే అవగతమవుతుందని మండల ప్రజలు చెప్పకనే చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్ళితే.. ఆయుష్ అనేది సంప్రదాయ వైద్యానికి నిదర్శనం. ఒకప్పుడు 2013 ముందు ఈ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి రోగులతో అధిక సంఖ్యలతో కిటకిటలాడేది. మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పక్క పక్కనే ఉన్న ఆయుష్ ఆసుపత్రికే ఓపీ ఎక్కువగా ఉండేది. పెన్ పహాడ్ మండలం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి రోగులు రావడంతో అధిక సంఖ్యలో క్యూ కట్టేవారు. ఆరోజుల్లో ఇంగ్లీష్ మెడిషన్ కంటే ఆనాడు వైద్యాధికారి చేస్తున్న సేవలు.. ఆయుష్ మీద నమ్మకం ఉండడంతో ఆయుష్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడింది. తెలంగాణ ఉద్యమ తదనంతరం 610 జీవోతో అప్పడు ఇక్కడ ఉన్న వైద్యాధికారి బదిలీ కావడంతో కళకళలాడిన ఆయుష్ ఆసుపత్రి దశాబ్ద కాలంగా వెలవెలబోతుందని.. దీంతో మండల ప్రజలకు ’ఆయుష్’ తగ్గిందని బహిరంగ ఆరోపనలు వస్తున్నాయి.

ఒంటి పూట బడులా.. కొలువులు

610 జీవోతో వెళ్ళిన పర్మినెంట్ వైద్యాధికారితోనే దశాబ్దాల కాలంగా ఆయుర్వేద ఆసుపత్రికి చీకటి రోజులుగా మిగిలిపోయాయి. అప్పటి నుంచి పర్మినెంట్ వైద్యాధికారి లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా డిప్యూటేషన్ ల పై ఆసుపత్రిలో సేవలు అందాయి. వైద్యాధికారి ఇష్టారాజ్యంగా విధులుకు హాజరు కావడం.. పశ్నించే వారు లేక పోవడం.. ఫోర్త్ ఎస్టేట్లో కొందరిని మ్యానేజ్ చేసుకోవడంతో అడప తడప వచ్చి సంతాకాలు చేసి వెళ్ళుతుండడంతో ఆయుర్వేద ఆసుపత్రి పదానికి ఆనవాలు లేకుండా పోయాయి.

ఆసుపత్రి సిబ్బందిలో వైద్యాధికారితో పాటు ఫార్మసిస్టు పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఇటీవలనే పర్మినెంట్ వైద్యాధికారి రాంప్రసాద్, ఫార్మసిస్టు షాజా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రికి ఊరికి, వ్యవసాయ భూములకు ఆనుకొని ఉండడంతో ఎవరూ వస్తారులే... ఎవరు ఏమంటారులేని  వేసవి కాలంలో విద్యాశాఖలో ఒంటిపూట బడుల్లా మద్యాహ్నానికే ముగించుకొని ఎలా వెళ్ళుతారో... అలాగానే ఇంటి దారిపడుతుండడం.. ఈరోజు నేను.. రేపు నువ్వు అని (బాధ్యతలు పంచుకుంటూ) విధులు చేపడుతున్నారని పలు ఆరోపనలు మిన్నంటినా వారికి పరిపాటిగా మారిందని చెప్పవచ్చు.

కలిసివచ్చిన ’డిప్యూటేషన్’ పేరు

రెండు రోజుల పాటు ’విజయాక్రాంతి’ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ’డిప్యూటేషన్.. బాధ్యతల విధులు’ అనుమానం తేటతెల్లం అయింది. మండల ప్రజలు చేస్తున్న ఆరోపనలు నిజం అయిందని చెప్పవచ్చు. సోమవారం వైద్యాధికారి విధులకు గైర్హాజర్ కాగా ఫార్మసిస్టు హాజరై మధ్యాహ్నానికే ఇంటి దారి పట్టింది. కాగా మంగళవారం వైద్యాధికారి ఆసుపత్రికి హాజరు కాగా ఫార్మసిస్టు గైర్హాజర్ అయింది.

కాగా మంగళవారం వైద్యాధికారి పెన్ పహాడ్ లో పర్మినెంట్ విధులు చెపట్టాల్సి ఉండగా సూర్యాపేటలోని ఆయుర్వేద ఆసుపత్రికి డిప్యూటేషన్ కూడా ఉందని అందుకే తాళం వేసి మద్యాహ్నం వెళ్ళినట్టు తెలిసింది. ప్రతి సారి మద్యాహ కాగానే వెళ్ళుతుండడం వెనుక సూర్యాపేట డిప్యూటేషన్ డ్యూటీ అనే షాక్ ఆయనకు కలిసి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా నిత్యం ఆసుపత్రికి మూత పడుతుండడంతో నిత్యం రోగులు ప్రతిక్షణలు చేస్తు అయోమయంలో పడిపోయారు. దీంతో రోగులు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

కొరవడిన పర్యవేక్షణ

డిప్యూటేషన్ డ్యూటీ, బాధ్యతల విధులు చేపడుతున్న సమయంలో సెలవుచీటీలు పెట్టి మరుసటి రోజు వచ్చి రిజిష్టర్లో హాజరు వేసుకోవడం.. ఇంత జరుగుతన్నా ఉన్నతాధికారుల పట్టింపు కొరవడింది. ఉన్నత అధికారులు చర్యలకు పదనుపెడితే దవాఖానా నిత్యం తెరుచుకోవడం.. రోగులకు సరియైన, నమ్మకమైన వైద్యం అందుతుందని మండల వాసులు, రోగులు ఆశపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిబ్బంది సమయ పాలన పాటించే విధంగా ప్రజలకు ఆయుష్ మీద నమ్మకం కలిగే విధంగా దృష్టి సారించాలని ఉన్నతాధికారులను మండల ప్రజలు వేడుకుంటున్నారు.