17 April, 2026 | 8:44 AM

శభాష్‌.."మాచన"

20-05-2025 09:44 PM

రాష్ట్రపతి భవన్‌ నుంచి పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్మెంట్‌ డిప్యూటీ తాహసిల్దార్‌ మాచన రఘునందన్‌కు ఫోన్‌..

22 ఏండ్లుగా పొగాకు నియంత్రణ కృషిపై అభినందన..

‘హలో.. యే.. రఘునందన్‌ మాచన హై?! హమ్‌ రాష్ట్రపతి భవన్‌ సే బాత్‌ కర్‌ రహే హై‘ అంటూ.. తనకు రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు ఫోన్‌ చేశాయని పౌర సరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్మెంట్‌ డిప్యూటీ తాహసిల్దార్‌, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్‌ చెప్పారు. పొగాకు నియంత్రణపై తాను చేస్తున్న కృషి, అవగాహన చర్యలను రాష్ట్రపతి తరపున అభినందించారని తెలిపారు.

హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన 22 ఏండ్ల పొగాకు నియంత్రణ కృషిని ఇటీవలే రాష్ట్రపతి భవన్‌కు ఇ మెయిల్‌లో, వెబ్‌సైట్‌లో ప్రార్థన లేఖలో వివరించినట్టు తెలిపారు. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. విద్యాసంస్థలు, కళాశాలల వద్ద సిగరెట్‌, బీడీ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించాలని కోరినట్టు పేర్కొన్నారు. పిల్లలకు అడిగినంత ప్యాకెట్‌మనీ ఇచ్చి చెడు అలవాట్లకు కొందరు ఆజ్యం పోస్తున్నారని, టీజేజర్లు, యువతకు ఎలా మత్తుకు బానిస అవుతున్నదో వివరిస్తూ 42 పేజీల లేఖను రాష్ర్టపతి భవన్‌కు రిజిస్టర్డ్‍ పోస్టు చేసినట్టు వెల్లడించారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ అధికారులు ఫోన్‌ చేసి మరీ అభినందించడంతో తన జన్మ ధన్యమైందని హర్షం వ్యక్తం చేశారు.