12 May, 2026 | 5:55 PM

తెలంగాణ హైకోర్టుకు బండి భగీరథ్

12-05-2026 04:45 PM

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) కుమారుడు బండి సాయి భగీరథ్(Bandi Bhagirath ) నగరంలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన 'పోక్సో' (POCSO) కేసు సంబంధించి మధ్యంతర బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును(Telangana High Court) ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతుండటంతో ఆయన ఈ పిటిషన్‌ను 'వెకేషన్ బెంచ్' ముందు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ మే 14న విచారణ చేపట్టనుంది.

భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధికారులను ఆదేశించడంతో, ఈ కేసు కీలక మలుపు తిరిగింది. హోం శాఖ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, భగీరథ్‌పై నమోదైన కేసుపై దర్యాప్తు ప్రారంభించాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.

మే 8, 2026న ఫిర్యాదు నమోదైనప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భగీరథ్‌పై నమోదైన 'పోక్సో' (POCSO) చట్టం కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ సోమవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ SITని ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, కేంద్రమంత్రిగా బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు ఆందోళన చేస్తున్నారు.