1 June, 2026 | 9:31 PM

ముస్లింల సమస్యల పరిష్కారానికి బీసీ కమిషన్ హామీ

01-06-2026 09:01 PM

- బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణల అంశంపై యాకూబ్ పాషా వినతి

కొత్తగూడెం,(విజయక్రాంతి): ముస్లింలకు సంబంధించిన బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా బీసీ కమిషన్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్య, ఉపాధి అవకాశాలను పొందేందుకు అర్హులైన ముస్లింలకు ఈడబ్లూఎస్ సర్టిఫికెట్లు పొందేందుకు సరైన మార్గదర్శకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా విద్యాశాఖ రూపొందించిన ఐయస్ఎంఎస్ పోర్టల్‌లో ముస్లిం విద్యార్థుల వివరాలలో మహమ్మద్ ఇంటి పేరు గల విధ్యార్దుల నమోదుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించి  భవిష్యత్తులో ముస్లిం రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ సమానంగా చేరేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయాలపై స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు యాకూబ్ పాషా తెలిపారు. దీంతో ముస్లిం వర్గాల్లో సమస్యల పరిష్కారంపై ఆశాభావం వ్యక్తమవుతోందని తెలిపారు.