27-06-2025 06:02:55 PM
వలిగొండ,(విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెడిసిన్, ఇంజక్షన్స్, అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. అనంతరం జెడ్పి సీఈవో శోభారాణి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు.
వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 14 జ్వరం కేసులు నమోదు కావడం జరిగిందని వలిగొండ పీహెచ్సీ క్రింద 17 గ్రామాలు మూడు సబ్ సెంటర్లు ఉన్నాయని వాటన్నింటిలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు ఫ్రైడే కార్యక్రమాన్ని ముందురోజు టంటం వేయించాలని గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య క్యాంపులు నిర్వహించాలని అన్నారు. పి హెచ్ సి పరిసరాలలో ఆయుర్వేద మొక్కలు నాటడం జరుగుతుందని ఆసుపత్రి సిబ్బంది వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.