27-06-2025 05:58:27 PM
తెలుగుదేశం పార్టీ మెదక్ పార్లమెంటరీ అధ్యక్షుడు ఇల్లందుల రమేష్
సిద్దిపేట: బనకచర్లపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటల్లో ఏమాత్రం అర్థం లేదని తెలుగుదేశం పార్టీ మెదక్ పార్లమెంటరీ అధ్యక్షుడు ఇల్లందుల రమేష్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి నాయకులతో కలిసి రమేష్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు తెలంగాణకు అన్యాయం చేయాలని ఆలోచన ఏమాత్రం ఉండదని తెలిపారు. తెలంగాణకు కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగులు జలాల గురించి చర్చలు జరిగాయని, వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల వినియోగం గురించి అప్పుడు చేసుకున్న ఒప్పందాలని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలిపారు.
ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్సీ కవిత ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి కేసిఆర్ టిడిపిలోనే రాజకీయం నేర్చుకున్నాడనే విషయం కవిత మర్చిపోవద్దన్నారు. చంద్రబాబు నాయుడు అన్నివేళలా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటాడు గాని ఏమాత్రం కీడు తలపెట్టడని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హైదరాబాదులో ఐటీ ని అభివృద్ధి పరిస్థితినే నేడు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని గుర్తు చేశారు. లిక్కర్ బిజినెస్ చేసిన కవిత ప్రాజెక్టుల గురించి మాట్లాడితే పరువు పోతుందని ఎద్దేవా చేశారు.
కాలేశ్వరం అవినీతిపై, ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ పెడదామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను బీఆర్ఎస్ స్వీకరించాలన్నారు. అతి తొందరలోనే బి ఆర్ ఎస్ పార్టీ ఖాళీ అవడం ఖాయమని.... టిడిపి బలోపేతం ఇవ్వడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఅరెస్ అవినీతిని ఎండగడతామన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవితతో పాటు బి ఆర్ ఎస్ నాయకులు టిడిపిని విమర్శించడం మానుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యం, సత్తయ్య, పేరిడి వెంకటరెడ్డి, కిషన్, వేణు, రాములు, గౌస్ పలువురు పాల్గొన్నారు.