ఊరికి కీడు సోకిందని..?
మహబూబాబాద్, జులై 19 (విజయక్రాంతి): ఒకరి తర్వాత ఒకరు.. వరస మరణాలతో తమ ఊరికి ఏదో కీడు సోకిందని.. ఊరి జనమంతా ఒకరోజు ఊరును వదిలి వనం బాట పట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి లో ఆదివారం జరిగింది. గ్రామంలో ఇటీవల పలువురు వ్యక్తులు మృత్యువాత పడడంతో, ఊరికి ఏదో జరగకూడనిది జరిగిందని, ఊరి జనమంతా ఉన్నఫలంగా ఆదివారం తెల్లవారుజామునే కల్లాపి చల్లకుండా వనవాసం వెళ్లాలని,
అక్కడే వంటావార్పు చేసుకుని సాయంత్రం వరకు వనంలోనే గడిపి తిరిగి ఇంటికి వస్తే ఊరికి పట్టిన కీడు తొలగిపోతుందనే ప్రచారంతో.. దాదాపు 230 కుటుంబాలకు చెందిన రెండువేల మందికి పైగా జనం ఊరి పక్కనే ఉన్న వనంలోకి వెళ్లి ‘బయటి వంటలు’ చేసుకుని అక్కడే ఆరగించారు. నాగరిక సమాజంలో, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలను జనం విడిచి పెట్టడం లేదనడానికి గున్నేపల్లి ఘటన తాజా ఉదాహరణగా నిలుస్తోంది.






