21-06-2025 11:10:20 PM
పరిశ్రమ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్ చెరు: పటాన్ చెరు పరిధిలోని పరేక్ ప్లాస్ట్ పరిశ్రమ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం చేసినట్లు పరేక్ ప్లాస్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని కార్మిక శాఖ కార్యాలయంలో డీసీఎల్ రవీందర్ రెడ్డి సమక్షంలో పరిశ్రమ యాజమాన్యం తరపున సమీర్ కులకర్ణి, కార్మిక సంఘం తరఫున యూనియన్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ల మధ్య వేతన ఒప్పందంపై చర్చలు జరిగాయని తెలిపారు. మెరుగైన వేతన ఒప్పందానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందుకుంటున్నా వేతనానికి అదనంగా ప్రతి కార్మికుడు రాబోయే మూడు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.4వేల చొప్పున మొత్తం రూ.12 వేల వేతనం చెల్లించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు.
ప్రతి దసరా పండగకి రూ.2500 యాన్యువల్ డే గిఫ్ట్ తో పాటు, బోనస్, ఇతర సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. తమ సంఘంపై కార్మికుల పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెరుగైన వేతన ఒప్పందం చేసినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లోనూ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. మెరుగైన వేతన ఒప్పందం చేసిన ఎమ్మెల్యేను పరిశ్రమ కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు సతీష్, బాలరాజు, రాజు, మంగ రావు, వినోద్, సత్యనారాయణ, శ్రీకాంత్, బాల్ రెడ్డి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.