గుడుంబా స్థావరాలుపై పోలీసుల దాడులు
భూపాలపల్లి,(విజయక్రాంతి): గుడుంబా స్థావరాలపై భూపాలపల్లి పోలీసులు దాడులు చేపట్టారు. జిల్లా పరిధిలోని పలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మురులో పోలీసులు తనిఖీ నిర్వహించి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం, 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం తయారీ, విక్రయాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా శనివారం పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడి నిర్వహించారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






