22-06-2025 12:10:24 AM
న్యూఢిల్లీ, జూన్ 21: గతేడాది జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను తలదన్నుతూ బీజేపీ ఏకంగా రూ. 1494 కోట్లు (44.56 శాతం) ఖర్చు చేసింది. 32 జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం రూ. 3,352.81 కోట్లు ఖర్చు చేసినట్టు అసోసియేషన్ ఫర్ ద డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది.
ఇక కాంగ్రెస్ పార్టీ 18.5 శాతం ఖర్చుతో రెండో స్థానంలో నిలిచింది. 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ రూ. 620 కోట్లు ఖర్చు చేసింది. దేశంలోని 32 జాతీయ పార్టీలు కలిసి రూ. 2,204 కోట్లు (65.75 శాతం) ఖర్చు చేయగా.. ప్రాంతీయ పార్టీలు రూ. 1148.81 కోట్లు (34.25 శాతం) మాత్రమే ఖర్చు పెట్టా యి. మార్చి 16 2024 నుంచి జూన్ 6 2024 వరకు ఈ ఎన్నికలు జరగ్గా.. అన్ని పార్టీల ఖర్చు తడిసిమోపెడయింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు ఇతర రూపాల్లో రూ. 6,930.246 కోట్లు, రాష్ట్ర పార్టీలు రూ. 515.32 కోట్ల నిధులు సమకూర్చుకోగా.. అందులో సింహభాగం సార్వత్రిక ఎన్నికల కోసమే ఖర్చు చేశా యి. రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పనిసరి వ్యయ జాబితా ఆధారం గా ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. అన్ని పార్టీలు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన 90 రోజుల్లోపు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 75 రోజుల్లోపు ఎన్నికల సంఘానికి ఈ జాబితా సమర్పించాలి.
పార్టీలు ససేమిరా..
ఈ జాబితా సమర్పించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు అంతగా సుముఖత చూపలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 168 రోజుల ఆలస్యంగా, బీజేపీ 139 నుంచి 154 రోజుల ఆలస్యంగా (వివిధ రాష్ట్రాల జాబితాల విషయంలో వివిధ రకాలుగా) ఆలస్యం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన ఏకీకృత నివేదికను సమర్పించింది.
ఎన్నికల కోసం అయిన మొత్తం ఖర్చులో 53శాతం రూ. 2,008 కోట్లను ప్రచారాల కోసమే ఖర్చు చేయడం గమనార్హం. ఇక ప్రయాణాలకు రూ. 795 కోట్లు, అభ్యర్థులకు ఒకే మొత్తంలో ఇచ్చిన పేమెంట్లు రూ. 402 కోట్లు, వర్చువల్ క్యాంపెయిన్స్కు రూ. 132 కోట్లకు పైచిలుకు ఖర్చు చేశాయి.
స్టార్ క్యాంపెయినర్ల కోసమే..
పార్టీలు చేసిన ప్రయాణ ఖర్చు రూ. 795 కోట్లలో రూ. 765 కోట్లు స్టార్ క్యాంపెయినర్లను తరలించేందుకే ఖర్చయింది. మిగతా రూ. 30 కోట్లను మాత్రమే ఇతర అభ్యర్థుల తరలింపు కోసం ఖర్చు చేశారు. ప్రచారానికి 32 జాతీయ పార్టీలు చేసిన ఖర్చు రూ. 1511.3004 కోట్లు కాగా.. ప్రాంతీయ పార్టీలు కేవలం రూ. 496.99 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి.
ఈ నివేదికను తయారు చేసే సమయానికి ఎన్సీపీ, సీపీఐ, జేఎంఎం, శివసేన (యూబీటీ) వంటి 21 పార్టీల స్టేట్మెంట్లు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో లేవు. 2024లో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ఆర్జేడీ, ఎల్జేపీ (ఆర్వీ), కేసీ (ఎం) వంటి పార్టీల ఖర్చుల నివేదికలు అందుబాటులో లేవు.