22-06-2025 12:08:11 AM
- పించన్ 400 నుంచి 1100 పెంచుతూ నిర్ణయం
- జూలై 1 నుంచి అమల్లోకి కొత్త పించన్
పట్నా, జూన్ 21: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఇస్తున్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు ఇస్తున్న రూ. 400 పించన్ మొత్తాన్ని రూ. 1100లకు పెంచేశారు. జూలై 1 నుంచే పెంచిన పించన్ లబ్ధిదారులకు అందనుంది.
ఈ పెంపు వల్ల కోటి 9 లక్షల 69వేల 255 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ‘సామాజిక భద్రతా పించన్ పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇకపై నెలకు రూ. 1100 పించన్ అందించనున్నామనే నిర్ణయాన్ని తెలుపుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నా. అర్హులైన లబ్ధిదారులందరికీ జూలై 1 నుంచే పెంచిన పించన్ అందనుంది.
జూలై 10వరకు అందరి అకౌంట్లలో పించన్ సొమ్ము జమయ్యేలా చూస్తాం. ఈ నిర్ణయం ఒక 1,09,69,255 మందికి ప్రయోజనం చేకూర్చనుంది.’ అని సీఎం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం నితీశ్ కుమార్ ఓటర్లను తనవైపుకు తిప్పుకునేందుకే ఈ పథకం ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చారిత్రక దినం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించిన నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ ‘నేడు చారిత్రాత్మక రోజు. సీ ఎం వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు చేయడం హర్షనీయం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.