యమునా నదిలో పడవ బోల్తా
12 మంది మృతి.. మరికొందరి గల్లంతు
లక్నో, ఏప్రిల్ 10: ఉత్తరప్రదేశ్లోని మధురలో యమునా నదిలో శుక్రవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది మరణించారు. కొందరు గల్లంతయ్యారు. 14 మందిని పోలీసులు, స్థానికులు రక్షించారు. ప్రత్యక్ష సాక్షులు, ప్రాథమిక వివరాల ప్రకారం.. పడవ ఓ తాత్కాలిక వంతెనను ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కేసీ ఘాట్ సమీపంలో, సుమారు 25 నుంచి 30 మందిని తీసుకువెళ్తున్న రెండు పడవల్లో ఒకటి అకస్మాత్తుగా మునిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం యమునా నదిలో తాత్కాలిక వంతెన ఉన్న ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలో సుమారు 25 నుంచి 27 మంది ఉన్నట్లు సమాచారం. పడవ ఆ వంతెనను ఢీకొనడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని తెలుస్తోంది.
ఘటనా స్థలం నుంచి 10 మృతదేహాలను వెలికితీశామని మధుర డీఐజీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. అగ్నిమాపక, పోలీసు బృందాలు, స్థానిక ఈతగాళ్లు, పడవ నడిపేవాళ్లతో కలిసి ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం గల్లంతైన వ్యక్తులందరి కోసం గాలింపు కొనసాగుతోందని పాండే వెల్లడించారు.




