08-06-2025 12:00:00 AM
తనూజ ముఖర్జీ.. 60, 70 లలో హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించి.. తనదైన ముద్ర వేసింది సినీ ప్రపంచంలో. స్వతహాగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నతనం నుంచి నటన ఆమెకు అబ్బింది. ఆమె తండ్రి నిర్మాత కుమార్సేన్ సమర్థ్, తల్లి ప్రసిద్ధ సినీ నటి శోభన సమర్థ్.
అక్క నూతన్ అప్పట్లో టాప్ హీరోయిన్గా ఉన్నది. తన కెరీర్లో వందకు పైగా చిత్రాల్లో నటించింది. ఉత్తమ నటిగా పలు అవార్డులను సొంతం చేసుకున్నది. అందం, అభినయం రెండు ఆమె సొంతం అనడంతో ఎలాంటి సందేహం లేదు.
చైల్డ్ ఆర్టిస్టుగా ‘హమారీ బేటీ’, ‘తనూజా’, ‘ఖాందాన్’ తో రంగ ప్రవేశం చేసింది. ‘హమారీ బేటీ’ చిత్రానికి దర్శకత్వం వహించింది తనూజ తల్లి శోభన. అప్పుడు ఆమె వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. ఆ చిత్రం ఆమెకు బేబీ తనూజగా పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా సమయంలో తనూజ రెండు దంతాలు కోల్పోయింది.
తర్వాత ఉన్నత చదువుల కోసం స్విట్జర్లాండ్ వెళ్లింది. తనూజకు చదువు అంటే ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. కానీ కొత్త భాషలు నేర్చుకోవాలి అనే ఆసక్తి మాత్రం చిన్నతనం నుంచే ఉండేదట. స్విట్జర్లాండ్లో చదువుతున్నప్పుడు తండ్రికి జర్మన్ భాషలో ఉత్తరాలు రాసేదట.
అదే సమయంలో ఆమెకు పియర్ ఫ్రాంకో గియాకార్డి అనే ఇటాలియన్ అబ్బాయితో పరిచయం ఏర్పడ్డది. ఆమె అతనితో కొంతకాలం డేటింగ్ చేసిందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆర్థిక సమస్యల కారణంగా 16 ఏళ్లకే చదువు ఆపేసి.. ఇండియాకు వచ్చేసి.. సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
కెరీర్ సీరియస్గా తీసుకోలేదు
అప్పటికే టాప్ హీరోయిన్గా ఉన్న అక్క నూతన్తో కలిసి ‘చాబిలి’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఈ చిత్రంలో తనూజ పాత్ర చిన్నదైన.. అభినయంతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్రను వేసింది. కిదార్ శర్మ దర్శకత్వం వహించిన ‘హమారీ యాద్ ఆయేగి’ షూటింగ్ సమయంలో ఒక సన్నివేశంలో ఏడవాల్సి వచ్చినప్పుడు.. తనూజ బాగా నవ్వినందుకు చిత్రనిర్మాత చెంపచెళ్లుమనిపించాడు.
ఇది అప్పట్లో సెన్సెషనల్ వార్త ఇండస్ట్రీలో. ‘తనూజ బెంగాలీ చిత్రాలైన ‘దేయా నేయా’, ‘ఆంటోనీ ఫిరింగీ’, ‘తీన్ భుజనేర్ పారే’, ‘ప్రథమ్ కదమ్ ఫూల్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మరాఠీ చిత్రాల్లో కూడా తన ప్రతిభను చూపించింది. 1985లో తనూజ దూరదర్శన్లో ‘ఖాందాన్’ షో ద్వారా టెలివిజన్ రంగప్రవేశం చేసింది.
వ్యక్తిగతం..
తనూజ చైన్ స్మోకర్.. ఈ విషయంలో ఎప్పుడూ.. ఎక్కడ రాజీ పడలేదు, సిగ్గుపడలేదు. ఆమె ఎంతమంది మధ్యలో ఉన్న కూడా స్మోకింగ్ చేసేదట. 1972లో ‘ఏక్ బార్ ముస్కురా దో’ అనే హిందీ డ్రామా సినిమా సెట్స్లో చిత్రనిర్మాత షోము ముఖర్జీని కలిసింది. వీరిద్దరు కలిసిన ఏడాదికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారైలు కాజోల్, తనీషా ముఖర్జీ ఇద్దరు ప్రస్తుతం బాలీవుడ్లో అగ్ర హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
తర్వాత కొన్ని కారణాలతో తనూజ తన భర్తతో విడాకులు తీసుకున్నది. ఆ తర్వాత కొద్దిరోజులకు భర్త షోము ముఖర్జీ గుండెపోటుతో మృతిచెంచాడు. 2022లో తనూజ ‘మోడరన్ లవ్ ముంబై’ అనే వెబ్ సిరీస్లో పని మనిషి పాత్రను పోషించింది. 2023లో అనారోగ్య సమస్యలతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స తీసుకుని కోలుకున్నది. ప్రస్తుతం చిన్నకూతురు తనీషాతో కలిసి ఉంటున్నది.